Apple new CEO: ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ (Apple) తన నాయకత్వ మార్పును అధికారికంగా ప్రకటించింది. సంస్థ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా జాన్ టెర్నస్ నియమితులయ్యారు. ప్రస్తుత సీఈవో టిమ్ కుక్.. తన బాధ్యతల నుండి తప్పుకుని యాపిల్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్కు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా వ్యవహరించనున్నారు.
సెప్టెంబర్ 1న బాధ్యతల స్వీకరణ: ప్రస్తుతం యాపిల్లో హార్డ్ వేర్ ఇంజినీరింగ్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (SVP)గా ఉన్న జాన్ టెర్నస్ను సీఈవోగా కంపెనీ బోర్డు ఏకగ్రీవంగా ఎన్నుకుంది. టెర్నస్ ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుండి సీఈవోగా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టనున్నారు. 2011 నుంచి యాపిల్ను అగ్రపథంలో నడిపిస్తున్న టిమ్ కుక్.. ఇకపై ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా కంపెనీ వ్యూహాత్మక నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తారు.
జాన్ టెర్నస్ నేపథ్యం: టెర్నస్ 2001లో యాపిల్ ప్రొడక్ట్ డిజైన్ టీమ్లో చేరారు. ఐఫోన్, ఐప్యాడ్ వంటి ఐకానిక్ ఉత్పత్తుల అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. హార్డ్ వేర్ రంగంలో ఆయనకు ఉన్న అపారమైన అనుభవం, సంస్థను భవిష్యత్తు సవాళ్లకు సిద్ధం చేయడంలో ఉపయోగపడుతుందని బోర్డు ధీమా వ్యక్తం చేసింది. సెప్టెంబర్లో కొత్త ఐఫోన్ లాంచ్తో పాటు టెర్నస్ బాధ్యతలు చేపట్టనుండటం టెక్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

