Google Maps introduce New Features: గూగుల్ మ్యాప్స్ అందుబాటులోకి వచ్చాక జర్నీ చాలా సులభతరమైందనే చెప్పవచ్చు. ముఖ్యంగా కొత్త రూట్స్లో జర్నీ చేసేవారికి, లాంగ్ జర్నీలో గూగుల్ మ్యాప్స్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ క్రమంలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఈ ఫీచర్ ఎప్పటికప్పుడూ అప్డేట్ అవుతూ వస్తోంది. మనం వెళ్లే రూట్లో సమీపంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్పిటల్స్.. ఇంకా ముఖ్యమైన వివరాలను సైతం అందిస్తుంది. ఈ నేపథ్యంలో మరిన్ని కీలకమైన అప్డేట్లతో గూగుల్ మ్యాప్స్ భారతీయులకు మరింత చేరువ కానుంది. అవేంటో చూద్దాం..
భారత్లో గూగుల్ మ్యాప్స్ వినియోగదారుల కోసం గూగుల్ సంస్థ మరిన్ని కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్లు ఇప్పటికే అమెరికాలో అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని రోజుల్లో భారతీయులకు సేవలు అందించనున్నాయి. ఆ ఫీచర్లు.. జెమిని ఏఐ ఫీచర్లు, వాయిస్ ఇంటరాక్షన్, సేఫ్టీ నోటిఫికేషన్లు, ట్రాఫిక్ అలర్ట్, యాక్సిడెంట్ జోన్ వార్నింగ్స్, మెట్రో టికెట్ బుకింగ్ వంటి సౌకర్యాలను ప్రకటించింది. ఈ ఫీచర్లు ఎలా ఉపయోగపడనున్నాయంటే..
- వాయిస్ ఇంటరాక్షన్
గూగుల్ మ్యాప్స్లో వాయిస్ ఇంటరాక్షన్ ఫీచర్.. జెమిని ఏఐ సాయంతో పనిచేస్తుంది. మీ జర్నీలో వెళ్లే రూట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ రెస్టారెంట్, పార్కింగ్ ఫెసిలిటీ వంటి ప్రశ్నలను మీరు అడగొచ్చు. మీ పర్మిషన్తో మీ షెడ్యూల్కు అనుగుణంగా గూగుల్ క్యాలెండర్లో మీ ఈవెంట్ను సైతం వాయిస్ ఇంటరాక్షన్ క్రియేట్ చేస్తుంది.
- ప్రోయాక్టివ్ లోకల్ టిప్స్
జెమిని ఏఐ ఆధారంగానే ఈ ఫీచర్ కూడా పనిచేస్తుంది. ఈ ఫీచర్ ద్వారా చుట్టుపక్కల వ్యాపారాలు, బెస్ట్ విజిటింగ్ ప్లేసెస్కి సంబంధించి సమాచారం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా సమీపంలోని ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల వివరాలను సైతం ఈ ఫీచర్ అందిస్తుంది. గతేడాది ప్రవేశపెట్టిన ఇన్స్పిరేషన్స్కి ఫీచర్కి అప్డేట్గా దీనిని తీసుకొచ్చింది.
Also Read: https://teluguprabha.net/technology-news/huge-discount-on-realme-p3-lite-5g-in-flipkart/
- ప్రోయాక్టివ్ ట్రాఫిక్ అలర్ట్స్
మీరు జర్నీలో ఉన్నప్పుడు మీరు వెళ్లే రూట్లో రోడ్డు మూసివేతలు, ట్రాఫిక్ అలర్ట్స్, ఆలస్యానికి సంబంధించి సమాచారాన్ని ప్రోయాక్టివ్ ట్రాఫిక్ అలర్ట్స్ ఫీచర్ అందిస్తుంది. అయితే మొదటగా ఈ ఫీచర్ను బెంగళూరు, ఢిల్లీ, ముంబయి లాంటి మెట్రోపాలిటన్ నగరాల్లో ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది.
- యాక్సిడెంట్ ప్రోన్ వార్నింగ్స్
దేశంలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని గూగుల్.. మ్యాప్స్లో కీలక ఫీచర్ను తీసుకొచ్చింది. వినియోగదారుల భద్రత దృష్ట్యా ప్రభుత్వ డేటా సాయంతో యాక్సిడెట్ ప్రోన్ వార్నింగ్స్ పనిచేస్తుంది. ఎక్కువగా ప్రమాదాలు చోటుచేసుకున్న ప్రాంతాలకు సంబంధించి అలర్ట్ ఇస్తుంది. గురుగ్రామ్, సైబరాబాద్(హైదరాబాద్), చండీగఢ్, ఫరీదాబాద్ నగరాల్లో ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు మొదటగా ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుంది.
- ఆథరిటేటివ్ స్పీడ్ లిమిట్స్
ప్రభుత్వ డేటా ఆధారంగా ఈ ఫీచర్ పనిచేస్తుంది. మీరు వెళ్తున్న రోడ్డుపై గరిష్ఠ వేగం పరిమితిని సూచిస్తుంది. మొదటి దశలో ఘజియాబాద్, నోయిడా, గురుగ్రామ్, లక్నో, జైపూర్, ఫరీదాబాద్, ముంబయి, కోల్కతా, హైదరాబాద్ నగరాల్లో ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు ఈ ఫీచర్ సేవలందిస్తుంది.
- మెట్రో టికెట్ బుకింగ్
గూగుల్ మ్యాప్స్ నుంచి మెట్రో ట్రైన్ టికెట్లు బుక్ చేసుకునేలా ఫీచర్ను తీసుకొస్తున్నట్లు ఇటీవల సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. ఢిల్లీ, చెన్నై, కొచ్చి, బెంగళూరులో ఈ సదుపాయం అందుబాటులో ఉండగా.. త్వరలో ముంబయిలో కూడా ప్రారంభం అవుతుంది. ప్రయాణికులు కొనుగోలు చేసిన టికెట్లు నేరుగా గూగుల్ వాలెట్లో సేవ్ అవుతాయి.
ఇంకా మిగతా ఫీచర్లను పరిశీలిస్తే.. వినియోగదారుల కోసం ప్రత్యేకంగా టూ వీలర్ నావిగేషన్ అవతార్ ఫీచర్ను ప్రవేశపెట్టనుంది. త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లకు దశలవారీగా అందుబాటులోకి వస్తుంది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమకు ఇష్టమైన బైక్ ఐకాన్ కలర్ను ఎంచుకోవచ్చు.
ఇక ఫ్లై ఓవర్ నావిగేషన్ ఫీచర్ వాయిస్ గైడెన్స్తో రాబోతుంది. దీని వల్ల స్ర్రీన్ వైపు చూడకుండానే డ్రైవింగ్ చేస్తూనే రూట్ తెలుసుకోగలుగుతారు. ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్లకు తొమ్మిది భాషల్లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.


