Lightweight Wheelchair India : వీల్ చైర్.. ఎందరో దివ్యాంగులకు అడుగులకు అండగా, వారి కదలికలకు తోడుగా నిలుస్తుంది. కానీ, ఆస్పత్రుల్లో కనిపించే బరువైన, ఇబ్బందికరమైన వీల్ చైర్లు వారికి స్వేచ్ఛనివ్వకపోగా, ఒకరకమైన భారంగా మారుతున్నాయి. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ, వారి జీవితాల్లో సరికొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ముందుకొచ్చింది ఐఐటీ మద్రాస్. దేశంలోనే అత్యంత తేలికైన వీల్చైర్ను ఆవిష్కరించి, ‘మేక్ ఇన్ ఇండియా’ స్ఫూర్తికి నిలువుటద్దంగా నిలిచింది. అసలు ఈ కొత్త ఆవిష్కరణ ప్రత్యేకతలేంటి..? ఇది దివ్యాంగుల దైనందిన జీవితాన్ని ఎలా మార్చబోతోంది..? సామాన్యులకు ఇది ఎప్పుడు అందుబాటులోకి రానుంది..?
భారత సాంకేతిక విజ్ఞానానికి తలమానికమైన ఐఐటీ మద్రాస్, దివ్యాంగుల కోసం ఒక అద్భుతమైన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. ‘వైడీ వన్’ (YD One) పేరుతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో, మోనో ట్యూబ్ రిగిడ్ ఫ్రేమ్తో కూడిన వీల్చైర్ను బుధవారం ఆవిష్కరించింది. కేవలం 9 కిలోల బరువుతో దేశంలోనే అత్యంత తేలికైన వీల్చైర్గా ఇది రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ ఉత్పత్తులకు దీటుగా, అత్యున్నత ప్రమాణాలతో దీనిని రూపొందించినట్లు ఆవిష్కర్తలు సగర్వంగా ప్రకటించారు.
‘వైడీ వన్’ ప్రత్యేకతలు ఇవే : సాధారణ వీల్చైర్లకు భిన్నంగా, ‘వైడీ వన్’ ఎన్నో ప్రత్యేకతలతో రూపుదిద్దుకుంది.
తేలికైన నిర్మాణం: ఏరోస్పేస్-గ్రేడ్ మెటీరియల్తో దీనిని తయారుచేశారు. అందువల్ల ఇది కేవలం తొమ్మిది కిలోల బరువుతో పక్షి ఈకంత తేలికగా ఉంటుంది. దీనివల్ల వినియోగదారులు ఇతరులపై ఆధారపడకుండా సులభంగా ముందుకు సాగవచ్చు.
అద్భుతమైన డిజైన్: దీని ఇంజినీరింగ్ డిజైన్ గరిష్ఠ బలాన్ని, శక్తి సామర్థ్యాలను తట్టుకునేలా ఉంటుంది. కార్లు, ఆటోలు వంటి ప్రజా రవాణా వ్యవస్థలో దీనిని మడతపెట్టి తీసుకువెళ్లడం చాలా సులభం.
వినియోగదారునికి అనుకూలం: ప్రతి వినియోగదారుడి శరీరాకృతి, కూర్చునే భంగిమ, రోజువారీ అవసరాలకు అనుగుణంగా దీనిని మార్చుకునే సౌలభ్యం ఉంది. ఇది దివ్యాంగులకు ఒక పరికరంగా కాకుండా, వారి శరీరంలో ఒక భాగంగా మారిపోతుంది. “ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వీల్చైర్ను వైకల్యానికి చిహ్నంగా చూస్తారు. ఆ ఆలోచన మారాలి. సరైన పద్ధతిలో రూపొందిస్తే ఇది దివ్యాంగులకు భారం కాదు, స్వాతంత్ర్యాన్ని ప్రసాదించే వరం. ఖరీదైన దిగుమతులకు ప్రత్యామ్నాయంగా, అత్యాధునిక ఇంజినీరింగ్తో ఈ ‘వైడీ వన్’ను నిర్మించాం” అని ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి. కామకోటి తెలిపారు.
మార్కెట్లోకి ‘థ్రైవ్ మొబిలిటీ’ : ఈ వినూత్న వీల్చైర్ను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి, ఐఐటీ మద్రాస్ ‘థ్రైవ్ మొబిలిటీ’ అనే స్టార్టప్ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక ప్రకారం, ప్రపంచ జనాభాలో దాదాపు 15% మంది ఏదో ఒక వైకల్యంతో బాధపడుతున్నారు. రానున్న దశాబ్దాల్లో ఈ సంఖ్య మరింత పెరగనున్న నేపథ్యంలో, ‘వైడీ వన్’ వంటి ఆవిష్కరణల ఆవశ్యకత ఎంతో ఉంది. ఈ ఆవిష్కరణ దివ్యాంగుల జీవితాల్లో కదలికలకే కాదు, వారి ఆత్మవిశ్వాసానికి కూడా కొత్త ఊపునిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


