Saturday, November 15, 2025
Homeటెక్నాలజీMobile Recharge Hike: మొబైల్ రీచార్జ్ ధరలు పెరుగుతున్నాయ్

Mobile Recharge Hike: మొబైల్ రీచార్జ్ ధరలు పెరుగుతున్నాయ్

Mobile Recharge Price Hike: మొబైల్ ఆపరేటర్లు మళ్లీ చార్జీలు పెంచేందుకు సిద్ధమవుతున్నవారు. ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని ప్రముఖ టెలికాం ఆపరేటర్లు జియో, ఎయిర్‌టెల్ తమ రీచార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచవచ్చు. నివేదిక ప్రకారం 10-12 శాతం వరకు పెంపు ఉండొచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా మధ్యస్థ, అధిక స్థాయి ప్లాన్‌ల వినియోగదారులపై ఈ మార్పు ప్రభావం చూపనుంది.

- Advertisement -

మేలో వినియోగదారుల సంఖ్యలో భారీ వృద్ధి

ఈ ఏడాది మే నెలలో దేశంలో దాదాపు 74 లక్షల మంది కొత్త మొబైల్ వినియోగదారులు చేరినట్టు సమాచారం. దీనితో దేశం మొత్తంగా 108 కోట్ల యాక్టివ్ మొబైల్ వినియోగదారులను కలిగి ఉంది. ఇందులో రిలయన్స్ జియో 5.5 మిలియన్ల మందిని చేర్చుకోగా, ఎయిర్‌టెల్ 13 లక్షల మందిని చేర్చుకుంది. ఈ గణాంకాలు టెలికాం కంపెనీలకు ధైర్యాన్ని ఇస్తున్నాయి. కస్టమర్లు ఇప్పుడు ఖరీదైన ప్లాన్‌లు తీసుకోవడానికీ సిద్ధంగా ఉన్నారన్న సంకేతం ఇస్తోంది.

ఈసారి టార్గెట్ వారే..

గతంలో బేసిక్ ప్లాన్‌లపై ధరలు పెరిగినప్పటికీ, ఈసారి టెలికాం కంపెనీలు ఎక్కువ డేటా వినియోగించే వినియోగదారులను లక్ష్యంగా పెట్టుకున్నాయి. 2024 జూలైలో బేసిక్ ప్లాన్‌లు 11-23% వరకు పెరిగాయి. కానీ ఇప్పుడు టారిఫ్ పెంపు మిడిల్-హై సెగ్మెంట్లపై ఉంటుంది. ఈ విధానం ద్వారా వారు ఎక్కువ ఆదాయం పొందగలుగుతారు. అదే సమయంలో ఎక్కువ మంది వినియోగదారులను కోల్పోకుండా చూసుకోవచ్చు.

ఈ మోడల్‌కు గుడ్‌బై?

నిపుణుల అంచనాల ప్రకారం, టెలికాం కంపెనీలు ఇప్పుడు ఒకే ప్లాన్ అందరికీ అనే మోడల్‌ను మార్చే యోచనలో ఉన్నాయి. డేటా వాడకం, స్పీడ్, టైమింగ్ ఆధారంగా వేర్వేరు ప్లాన్‌లు ప్రవేశపెట్టే అవకాశముంది. ఉదాహరణకు.. కేవలం రాత్రిపూట డేటా వాడే వారికి తక్కువ ధరల ప్లాన్, లేదా రోజుకు 1 GB కంటే తక్కువ అవసరమయ్యే వారికి ప్రత్యేక ప్లాన్ యోచనలో సంస్థలు ఉన్నాయి. ఈ విధంగా వినియోగదారులు తమ అవసరాల ప్రకారం ఎంపిక చేసుకునే స్వేచ్ఛ కలుగుతుంది.

5G విస్తరణ..

5G సేవలను బలోపేతం చేయడం కోసం టెలికాం కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టుతున్నాయి. వీటికి మద్దతుగా అధిక ఆదాయం అవసరం. టారిఫ్ పెంపు దిశగా ఈ నిర్ణయం తీసుకోబడుతోంది. వోడాఫోన్ ఐడియా మార్కెట్లో వెనుకబడుతున్న తరుణంలో, జియో, ఎయిర్‌టెల్ తమ వాటాను ఇంకా బలపరిచే అవకాశాలను గమనిస్తున్నాయి.

రెట్టింపు ఆదాయం

నివేదిక ప్రకారం, భారత టెలికాం రంగం 2025 నుంచి 2027 మధ్య రెట్టింపు వృద్ధిని సాధించే అవకాశముంది. పెరుగుతున్న టారిఫ్‌లు, వ్యక్తిగతీకరించిన ప్లాన్‌ల వినియోగం దీనికి ప్రధాన కారకాలు. ఎయిర్‌టెల్ ఎండి గోపాల్ విట్టల్ ప్రకారం, ఇప్పుడు “పర్సనలైజ్డ్ టారిఫ్‌లు” అవసరం చాలా ఎక్కువ, వినియోగదారులు ఒకే మోడల్ కాకుండా తమ అవసరాలకు తగ్గట్లు ప్లాన్ ఎంచుకునే స్వేచ్ఛ కోరుకుంటున్నారు.

వినియోగదారులపై ప్రభావం

ప్లాన్‌లు మరీ ఖరీదైనవిగా మారితే, వినియోగదారులు ప్రత్యామ్నాయాలు పరిశీలించవచ్చు. ఈ నేపథ్యంలో టెలికాం కంపెనీలకు ఒకవైపు 5G సేవలను అందించాలి, మరోవైపు వినియోగదారుల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. ఇది సవాలుతో కూడిన విషయమే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad