No layoffs at Infosys: కృత్రిమ మేధ (AI) రాకతో ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి టెక్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో.. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు తీపి కబురు అందించింది. తమ కంపెనీలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగాల కోత ఉండబోదని ఆ సంస్థ సీఈవో సలీల్ పరేఖ్ స్పష్టం చేశారు.
ఏఐతో ముప్పు లేదు: ప్రస్తుతం టెక్ పరిశ్రమలో ఆటోమేషన్, ఏఐ టూల్స్ వినియోగం పెరగడం వల్ల ఉద్యోగ భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ అంశంపై ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ స్పందించారు. ఏఐ వల్ల తక్షణమే ఉద్యోగాలు పోతాయన్నది వాస్తవం కాదని అభిప్రాయపడ్డారు. “ఐటీ రంగంలో ఏఐ అనేది ఒక పెను మార్పు అనడంలో సందేహం లేదు. కానీ అది వెంటనే ఉద్యోగాలను హరించివేస్తుందని అనుకోవడం తప్పు. గతేడాది మేము ఎక్కడా ఉద్యోగులను తొలగించలేదు. భవిష్యత్తులోనూ ఇదే విధానాన్ని కొనసాగిస్తాం.” అని సలీల్ పరేఖ్ అన్నారు. టెక్ రంగంలో అనిశ్చితి నెలకొన్న ఈ సమయంలో ఇన్ఫోసిస్ సీఈవో చేసిన ఈ వ్యాఖ్యలు సాఫ్ట్వేర్ నిపుణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.

