Shubhanshu Shukla: భారతీయ అంతరిక్ష చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం లిఖించబనుంది. వినువీధుల్లో మన దేశ కీర్తిపతాక రెపరెపలాడే మధురఘట్టం ఆవిష్కృతం అయ్యింది. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలు, ఆశీస్సులను గుండెల నిండా నింపుకొని మన వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసీలోకి పయనమయ్యారు. శుక్లాతో కలిసి మరో ముగ్గురు వ్యోమగాములను యాక్సియం-4 (Axiom-4) నింగిలోకి దూసుకెళ్లింది.
బుధవారం మధ్యాహ్నం 12.01 గంటలకు నాసాకు చెందిన కెన్నడీ స్పేస్ స్టేషన్ నుంచి యాక్సియం-4 మిషన్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. ఫాల్కన్- 9 రాకెట్ ద్వారా శుభాంశుతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు రోదసీలోకి వెళ్లారు. రేపు సాయంత్రం 4. 30 గంటలకు ఐఎస్ఎస్తో వ్యోమనౌక అనుసంధానం కానుంది( సరిగ్గా 28 గంటల తరువాత). ఈ ప్రయోగంతో ఇస్రోకు అంతర్జాతీయ ఖ్యాతి దక్కనుంది. ఈ మిషన్ కోసం భారత్ రూ. 550 కోట్లు ఖర్చు చేయనుంది.
14 రోజుల పాటు ఐఎస్ఎస్లో శుభాంశు శుక్లా గడపనున్నారు. శుభాంశు మిషన్ పైలట్గా వ్యవహరించనున్నారు. కాగా ఆరోగ్యం, వ్యవసాయం, జీవశాస్త్ర అంశాలపై అధ్యయనం చేయనున్నారు. కాగా ఈ మిషన్ ఇప్పటివరకు ఆరుసార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. మైక్రో గ్రావిటీలో కండరాల క్షీణతపై పరిశోధనలు చేపట్టనున్నారు.
నాసా స్పేస్ ఎక్స్ యాక్సియం-4 మిషన్లో అంతరిక్షంలోకి బయల్దేరిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా తొలిసారి రాకెట్లో నుంచి మాట్లాడారు. ‘ఇది కేవలం నా జర్నీ కాదు, దీనివల్ల భారతీయ అంతరిక్ష యాత్ర మరోసారి ప్రారంభం అయ్యింది. యావత్ ఇండియన్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మనమందరం కలిసి దీన్ని విజయవంతం చేద్దాం. జై హింద్.. జై భారత్’ అంటూ ఈ యాత్ర ఎంతో గొప్పదని, మాటల్లో వర్ణించలేనిదని శుభాంశు శుక్లా అన్నారు.
ALSO READ: https://teluguprabha.net/telangana-news/emergency-is-a-symbol-of-congress-leadership/
అయితే, రోదసీ యాత్రకు బయల్దేరిన శుభాంశు శుక్లాను చూసి తల్లిదండ్రులు భావోద్వేగానికి లోనయ్యారు. యాక్సియం-4 మిషన్ లాంచ్ కాగానే తమ కుమారుడికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. మరోవైపు శుభాంశు ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది. స్థానికులు బ్యాండ్ వాయిస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.
ALSO READ: https://teluguprabha.net/technology-news/poco-f7-5g-launch-india-2025/
40 ఏండ్ల తర్వాత భారత వ్యోమగామి అంతరిక్షంలోకి వెళ్లారు. 1984లో సోవియట్ యూనియన్కు చెందిన ఇంటర్కాస్మోస్ కార్యక్రమం కింద సోయుజ్ టి-11 వ్యోమనౌకలో రాకేశ్శర్మ అంతరిక్ష ప్రయాణం చేశారు. ఆ తర్వాత ఇప్పుడు అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్న రెండో భారత వ్యోమగామిగా శుభాంశు శుక్లా చరిత్రలో నిలిచిపోనున్నారు.
కాగా, ఫిబ్రవరి 2024లో ప్రధాని మోడీ మొదటి గగన్యాన్ అంతరిక్ష ప్రయాణంలో పాల్గొనే నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రకటించారు. ఈ నలుగురూ టెస్ట్ పైలట్లుగా విస్తృత అనుభవం ఉన్న భారత వైమానిక దళ అధికారులు. వీరిలో గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్ సింగ్, కమాండర్ శుభాంశు శుక్లా కూడా ఒకరు. 2027లో భారత్ మిషన్ గగన్యాన్ ప్రయోగం చేపట్టనుంది.