TCS Layoffs: ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ రాకతో సాఫ్ట్వేర్ కంపెనీల్లో కోత పెరుగుతోంది. వేల మంది ఉద్యోగులను తొలగిస్తూ కంపెనీలు ఆర్థికంగా భారాన్ని దించుకుంటున్నాయి. కానీ ఇన్నాళ్లూ తమ సంస్థలో పనిచేసిన ఉద్యోగులను నిరాశపరచకుండా వారి ఆర్థిక భద్రతను కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో భారతీయ కంపెనీ టీసీఎస్.. భారీ లేఆఫ్లు ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే టీసీఎస్లో ఉద్యోగాలు కోల్పోతున్న వాళ్లకి కంపెనీ భారీగానే ప్యాకేజీలు ముట్టజెబుతోంది.
ఈ ఏడాది టీసీఎస్ 12 వేల మందిని తొలగించనున్నట్లు జులైలో ప్రకటించడం తీవ్ర చర్చనీయాంశమైంది. తాజాగా లేఆఫ్ల ప్రక్రియను ప్రారంభించిన సంస్థ.. ఎక్కువకాలం తమ సంస్థలో పనిచేసిన వాళ్లకి దాదాపు రెండేళ్ల వేతనాన్ని పరిహారంగా చెల్లించనున్నట్లు తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), ఆటోమేషన్ రాక.. ఉద్యోగులపై ప్రభావం చూపగా వారు మరో కంపెనీలో రిక్రూట్ అయ్యేవరకు వారికి ఆర్థిక భరోసాను అందించనుంది.
మొదటగా మూడు నెలల నోటీసు పీరియడ్ ఇచ్చి ఆ 3 నెలల వేతనం టీసీఎస్ చెల్లించనుంది. దీనికి అదనంగా ఆరు నెలల నుంచి గరిష్ఠంగా 2 ఏళ్ల వరకు వేతనాన్ని పరిహారం కింద అందించనున్నట్లు సమాచారం. కాగా, లేఆఫ్లలో ఉద్యోగాలు కోల్పోయిన వాళ్లలో 8 నెలలకు మించి బెంచ్పై ఉన్న వాళ్లకి సింప్లర్ ప్యాకేజీ మాత్రమే చెల్లిస్తుండగా.. కంపెనీలో10 నుంచి 15 ఏళ్ల పాటు ఉద్యోగం చేసిన వాళ్లకు ఏడాదిన్నర వేతనాన్ని పరిహారంగా అందించనున్నారు. సింప్లర్ ప్యాకేజీ అంటే నోటీసు పీరియడ్ వేతనాన్ని మాత్రమే చెల్లిస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక 15 ఏళ్లు దాటినవారికి గరిష్ఠంగా 2 ఏళ్ల వేతనాన్ని అందించడంతో పాటు అదనంగా ఔట్ప్లేస్మెంట్ సేవలను కల్పించనుంది.
Also Read: https://teluguprabha.net/cinema-news/raviteja-kishorea-tirumala-rt-76-title-fixed/
ఇక తమ సంస్థలో లేఆఫ్స్ ద్వారా ఉద్యోగులు కోల్పోయిన వారికి TCS కేర్స్ ప్రోగ్రామ్ కింద మానసిక ఆరోగ్యానికి సంబంధించి చికిత్స లేదా థెరపీ సేవలు అందించనున్నారు. అలాగే రిటైర్మెంట్ వయసుకి దగ్గరపడ్డ వాళ్లకు ముందస్తు పదవీ విరమణ వరకు TCS అవకాశం కల్పించనుంది. వీళ్లకు 6 నెలల నుంచి 2 ఏళ్ల వరకు వేతనాన్ని పరిహార ప్యాకేజీ కింద చెల్లించడంతో పాటు బీమా ప్రయోజనాలు కూడా అందిస్తారని విశ్లేషకులు వివరించారు.


