UIDAI Launches SITAA: టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దాని వల్ల ప్రయోజనాలతో పాటు అనర్థాలు అంతకంతగా పెరుగుతూనే ఉన్నాయి. అత్యాధునిక సాంకేతికతను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అమాయకులను బురిడీ కొట్టించి అందినకాడికి దోచుకుంటున్నారు. ఇక, డీప్ఫేక్ టెక్నాలజీ సాయంతోనూ సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. అమాయకుల నుంచి పెద్ద ఎత్తున సొమ్ము కొల్లగొడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDAI- ఉడాయ్) కీలక అడుగు ముందుకేసింది.
డీప్ఫేక్ రూపంలో ఎదురయ్యే సైబర్ నేరాలపై ఉడాయ్ అప్రమత్తమైంది. దేశ డిజిటల్ గుర్తింపు వ్యవస్థను మరింతగా బలోపేతం చేయడానికి నిర్ణయించింది. ఇందుకోసం స్కీమ్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ అసోసియేషన్ విత్ ఆధార్(SITAA) పేరిట సైబర్ నేరగాళ్లకు కళ్లెం వేసేందుకు సిద్ధమైంది. డీప్ఫేక్లు, స్పూఫింగ్, ప్రెజెంటేషన్ వంటి రూపాల్లో ఎదురయ్యే సైబర్ దాడులను ఎదుర్కోవడమే ముఖ్య ఉద్దేశంగా ‘సిటా’ పనిచేస్తుంది.
Also Read: https://teluguprabha.net/national-news/trump-pak-afghan-dispute-easy-nobel-peace-prize-comments/
సిటాను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఉడాయ్.. స్టార్టప్లు, విద్యాసంస్థలు, పరిశ్రమ వర్గాల నుంచి సహకారం తీసుకుంటుంది. అధునాతన బయోమెట్రిక్ టెక్నాలజీ, అథంటికేషన్, ఏఐ, డేటా ప్రైవసీపై దృష్టి సారిస్తుంది. ‘సిటా’ ద్వారా భద్రతాపరంగా ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యవస్థను రూపొందించాలని ఉడాయ్ నిర్ణయించింది.
Also Read: https://teluguprabha.net/technology-news/cyber-criminals-loot-the-amount-by-spreading-fake-links/
ఈ మేరకు నవంబర్ 15 నుంచి ఆయా వర్గాల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుండగా నాస్కామ్, MeitY స్టార్టప్ హబ్ కూడా ఇందులో భాగమయ్యాయి. ఫేస్లైవ్ డిటెక్షన్ కోసం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్లను స్టార్టప్ కంపెనీలు అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ఫొటోలు, వీడియోలు, మాస్క్లు, మార్ఫింగ్ల ద్వారా జరిగే స్పూఫింగ్లను అడ్డుకోవడమే సిటా ముఖ్య ఉద్దేశం. ఏఐ, మెషీన్ లర్నింగ్ ఉపయోగించి ప్రెజంటేషన్ అటాక్ డిటెక్షన్ను అడ్డుకోవడానికి పరిశోధనా, విద్యా సంస్థలు ప్రతిపాదనలు పంపించాలి. ఈ అత్యాధునిక వ్యవస్థ ద్వారా ఆధార్ సేవలపై పౌరుల విశ్వాసాన్ని పెంచడమే ముఖ్య ఉద్దేశమని ఉడాయ్ పేర్కొంది. MSH పోర్టల్ ద్వారా ఈ ప్రోగ్రామ్కు దరఖాస్తు చేసుకోవాలని వెల్లడించింది.


