Mobile Phone Charging: చాలామంది తమ స్మార్ట్ఫోన్లను ఛార్జ్ చేసేటప్పుడు తరచుగా కొన్ని తప్పులు చేస్తుంటారు. అందులో ఫోన్లను 100 శాతం ఛార్జ్ చేయడం! దీని వలన పరికరం బ్యాటరీ త్వరగా క్షీణిస్తుంది. అయితే, స్మార్ట్ఫోన్ బ్యాటరీ లైఫ్ కాపాడుకోవాలంటే ఎక్కువసేపు ఛార్జ్ చేయడం మానుకోవాలి. ఫోన్ బ్యాటరీని 100% ఛార్జ్ చేయడం వల్ల బ్యాటరీ లైఫ్ తగ్గుతుంది. కాబట్టి మొబైల్ ఫోన్కు ఎంత శాతం ఛార్జ్ చేయాలి? ఓవర్ఛార్జింగ్ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.
మొబైల్ ఫోన్కు ఎంత శాతం ఛార్జ్ చేయాలి?
స్మార్ట్ఫోన్లను ఛార్జింగ్ కోసం ప్లగ్ ఇన్ చేసి ఉంచుతాం. 100% ఛార్జ్ అయిన తర్వాత కూడా వాటిని అలానే ప్లగ్ ఇన్ చేసి ఉంచుతాము. అయితే, ఫోన్ పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత ఛార్జింగ్ ఆటోమేటిక్గా ఆగిపోతుందని స్మార్ట్ఫోన్ కంపెనీలు చెబుతున్నాయి. కాకపోతే ఇది పూర్తిగా నిజం కాదు. ఫోన్ మంచి బ్యాటరీ లైఫ్ కోసం 20% నుంచి 80% మధ్య ఛార్జ్ చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఇది బ్యాటరీ మన్నికగా ఉంచడానికి సహాయపడుతుంది. అయితే, 100% వరకు వేగంగా ఛార్జ్ చేస్తే, బ్యాటరీ త్వరగా వేడెక్కుతుంది. పైగా బ్యాటరీలోని రసాయన సమతుల్యతపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో ఫోన్ స్పీడ్ నెమ్మదిస్తుంది. అందుకే నిపుణులు మొబైల్ ఫోన్ను 80% ఛార్జ్లో ఆపమని సిఫార్సు చేస్తున్నారు.
ఓవర్ఛార్జింగ్ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి?
స్మార్ట్ఫోన్ హీటింగ్: స్మార్ట్ఫోన్ను ఓవర్ఛార్జింగ్లో ఉంచితే, ఫోన్ కొద్దికొద్దిగా ఛార్జ్ అవుతూనే ఉంటుంది. దీని వలన అది వేడెక్కుతుంది. బ్యాటరీ లైఫ్ తగ్గుతుంది. ఇలా చేయడం వల్ల బ్యాటరీ పనితీరును మాత్రమే కాకుండా, పరికరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.
బ్యాటరీ సామర్థ్యంపై ప్రభావం: స్మార్ట్ఫోన్లు తరచుగా లిథియం-అయాన్ బ్యాటరీలతో వస్తాయి. ఇవి పరిమిత సంఖ్యలో ఛార్జ్-డిశ్చార్జ్ సైకిల్స్ ఉంటాయి. కావున 100% ఛార్జ్ చేస్తే ఆ సైకిల్స్ త్వరగా ముగుస్తాయి. దీని అర్థం ఫోన్ ను ఎక్కువసేపు ఛార్జ్ చేస్తే, బ్యాటరీ సామర్థ్యం ప్రభావితమవుతుంది.
ఫోన్ పేలుడు: ఫోన్ 100% ఛార్జ్ పూర్తి అయినా తర్వాత అలానే ప్లగిన్ చేయడం ప్రమాదకరం. దీని వల్ల బ్యాటరీ ఉబ్బిపోతుంది. కొన్నిసార్లు పేలిపోవచ్చు కూడా ! స్మార్ట్ ఫోన్ల తయారీదారులు ఛార్జ్ విషయంలో అనేక భద్రతా లక్షణాలను అందిస్తున్నప్పటికీ ఓవర్ఛార్జింగ్ ఇప్పటికీ ఫోన్ పేలిపోవడానికి కారణమవుతుంది.


