DA 2 PERCENT HIKE: విద్యుత్ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు శాతం డీఏ పెంచుతున్నట్లు శనివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. డీఏ పెంపుతో రాష్ర్టంలోని 71,417 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలగనుందని చెప్పారు. పెంచిన డీఏ ఈ సంవత్సరం జనవరి నుంచి అమల్లోకి వస్తుందని డిప్యూటీ సీఎం చెప్పారు. రెట్టించిన ఉత్సాహంతో ఉద్యోగులు పని చేయాలని భట్టి ఆకాంక్షించారు. విద్యుత్ రంగంలో తెలంగాణ దేశానికి దిక్సూచి కావాలని డిప్యూటీ సీఎం ఆకాంక్షించారు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వం, విద్యుత్ సిబ్బంది ఆదర్శ కుటుంబమని అభివర్ణించారు.
ప్రజాభవన్లో విద్యుత్ ఉద్యోగులకు డీఏ ప్రకటన అనంతరం డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడారు. ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయం అన్నారు. ఇందులో భాగంగా విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు 1.944 శాతానికి డీఏ పెంచి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు. పెంచిన డీఏ విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లతోపాటు ఆర్టిజన్స్కు వర్తిస్తుందన్నారు. గతంలో 14.074% గా ఉన్న డీఏ 16.018% శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని భట్టి తెలిపారు. పెంచిన డీఎతో విద్యుత్ సంస్థపై ప్రతి నెలా 11.193 కోట్ల రూపాయల భారం పడుతుందని చెప్పారు. పోటీ ప్రపంచంలో ప్రతి ఉత్పత్తికి విద్యుత్తు అనివార్యం అయ్యిందన్నారు. గత ప్రభుత్వ కాలంలో 2023 మార్చిలో 15 వేల మెగావాట్ల పీక్ డిమాండ్ రాగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025 మార్చిలో 17,162 మెగావాట్ల పీక్ డిమాండ్ వచ్చిందన్నారు. గత ప్రభుత్వ కాలంతో పోలిస్తే అదనంగా 2000 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చిందని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం, విద్యుత్ ఉద్యోగులు ఓ కుటుంబం మాదిరిగా శ్రమించి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా, నాణ్యమైన విద్యుత్ సరఫరాను చేశామని తెలిపారు.
భవిష్యత్తులో విద్యుత్ డిమాండ్ తీవ్రంగా పెరగనుందని భట్టి పేర్కొన్నారు. 2029-30 నాటికి విద్యుత్ డిమాండ్ 26,299 మెగావాట్లకు చేరనుందని చెప్పారు. 2034-35 నాటికి 33, 773 మెగావాట్ల డిమాండ్ ఏర్పడుతుందని కేంద్ర ప్రభుత్వ సంస్థ నివేదిక ఇచ్చిందని డిప్యూటీ సీఎం వివరించారు. భవిష్యత్తు డిమాండ్కు పెట్టిపు విద్యుత్ ఉత్పత్తికి ఇప్పటినుంచే రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు సిద్ధం చేసుకుని ముందుకు పోతుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యూ గ్రీన్ ఎనర్జీ పాలసీ-2025 తీసుకువచ్చి 2029-30 నాటికి 20వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని తెలిపారు.
ALSO READ: https://teluguprabha.net/telangana-news/ktr-comments-on-kaushikreddy-arrest/
కాగా, ఇటీవల విద్యుత్ ఉద్యోగులకు ప్రమాద బీమా కింద రూ. కోటి చెల్లించేలా ప్రభుత్వం ఎస్బీఐతో ఒప్పందం కుదుర్చుకుంది. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న సుమారు 52 వేల మంది ఉద్యోగులకు బీమా వర్తించనుంది. కాగా, శాశ్వత అంగవైకల్యం పొందిన వారికి రూ.80 లక్షల పరిహారం, ఉద్యోగి సహజ మరణం చెందితే రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా వర్తించనుంది. ఉద్యోగితోపాటు నలుగురు కుటుంబ సభ్యులకు కలిపి 20 లక్షల వరకు బీమా సౌకర్యం వర్తిస్తుంది.