CM Revanth Banjarahills: తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్లో హెల్త్ టూరిజం ఒక చాప్టర్గా ఉంటుందని, హైదరాబాద్ను హెల్త్ టూరిజం హబ్గా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన బంజారాహిల్స్లో AIG హాస్పిటల్ ప్రారంభోత్సవం అనంతరం మాట్లాలడారు. నగర ప్రజలకు రెండో అతిపెద్ద హాస్పిటల్ను అందుబాటులోకి తెచ్చినందుకు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డిని సీఎం అభినందించారు. నాగేశ్వర్ రెడ్డి హైదరాబాద్, తెలంగాణకు గొప్ప పేరు తీసుకొచ్చారని కొనియాడారు. ఆయన సేవలను గుర్తించి కేంద్రప్రభుత్వం పద్మవిభూషణ్ ఇచ్చిందని సీఎం రేవంత్ గుర్తు చేశారు. నాగేశ్వర్ రెడ్డికి భారతరత్న అవార్డుకు అర్హులని, ఆయనకు భారతరత్న వచ్చేలా తెలంగాణ నుంచి తన వంతు ప్రయత్నం చేస్తానని ముఖ్యమంత్రి అన్నారు.
66 దేశాల నుంచి వైద్యం కోసం ఏఐజీ ఆస్పత్రికి వస్తున్నారని ఇది గర్వకారణమని పేర్కొన్నారు. అందులో భాగంగానే డాక్టర్ నోరి దత్తత్యేయుడిని క్యాన్సర్ కేర్ సలహాదారుడిగా నియమించామన్నారు. తెలంగాణ రాష్ట్రం చేపట్టే ప్రణాళికలో డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి కూడా భాగస్వాములు కావాలని సీఎం కోరారు. ఆరోగ్యశ్రీ కింద రూ. 10 లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యం అందిస్తోందని సీఎం చెప్పారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలకి హెల్త్ ప్రొఫైల్ కార్డుని క్రియేట్ చేయాలని భావిస్తున్నామన్నారు. ఒక యూనిక్ ఐడీతో ఈ హెల్త్ ప్రొఫైల్ కార్డులు ఉంటాయని సీఎం రేవంత్ తెలిపారు.
‘ఒకప్పుడు ఉన్న ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ పోయి ఇప్పుడు స్పెషలిస్ట్ డాక్టర్స్ రోజులు వచ్చాయి. హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయడం ద్వారా దీన్ని బ్రేక్ చేయొచ్చు. ప్రపంచదేశాలతో పోటీ పడగలుగుతున్నామని చెప్పడానికే మిస్ వరల్డ్ పార్టిసిపెంట్స్కు AIG హాస్పిటల్ విజిట్ లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆసుపత్రులు నిర్మాణంలో ఉన్నాయి. గోశామహల్లో నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభించాం. నిర్మాణంలో ఉన్న వివిధ ఆసుపత్రులు పూర్తయితే మొత్తం 7 వేల పడకలు అందుబాటులోకి వస్తాయి. కార్పొరేట్ ఆసుపత్రులతో పోటీపడి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందిస్తున్నామని’ సీఎం తెలిపారు.
వైద్య రంగం అభివృద్ధికి రూ.11500 కోట్లు, విద్యా రంగానికి రూ. 21, 500 కేటాయించామని సీఎం పేర్కొన్నారు. పేదలకు క్వాలిటీ ఎడ్యుకేషన్, మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలకు మీ వైపు నుంచి సహకారం ఉండాలని సీఎం నాగేశ్వర్ రెడ్డిని కోరారు. వైద్యులు ఏడాదిలో నెల రోజుల పాటు సామాజిక బాధ్యతగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలందించాలని సీఎం కోరారు. సాంకేతిక రంగంలో ప్రపంచంలో హైదరాబాద్ ఒక వేదికగా నిలుస్తోందన్నారు.