Telangana Tourism Conclave: తెలంగాణ ఏర్పడి పదేళ్లయినా పర్యాటక రంగానికి ఒక పాలసీ లేదని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత టూరిజంకు ప్రత్యేక పాలసీ తీసుకువచ్చామని తెలిపారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శనివారం హైదరాబాద్ శిల్పారామంలో ఏర్పాటు చేసిన ‘’టూరిజం కాన్క్లేవ్-2025’’ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
టూరిజం కాంక్లేవ్లో తెలంగాణకు రూ. 15,279 కోట్ల పెట్టుబడులతో పాటు 50 వేల మందికి ఉపాధికి సంబంధించి ఒప్పందాలు జరిగాయి. ఈ మేరకు పర్యాటక రంగంలో రూ.15 వేల కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చినందుకు మంత్రి జూపల్లి కృష్ణారావును సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. మొత్తం 30 ప్రాజెక్టులకు సంబంధించి రూ.15,279 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ పెట్టుబడులతో 19, 520 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు రాబోతున్నాయని, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి లభించనుందని, మొత్తం 50,000 మందికి ఉపాధి అవకాశాలు కలుగబోతున్నాయని అధికారులు పేర్కొన్నారు. 10,000 కొత్త హోటల్ గదులు, థీమ్ పార్కులు, ఫిలిం టూరిజం, వెడ్డింగ్ డెస్టినేషన్స్ అభివృద్ధితో తెలంగాణను గ్లోబల్ టూరిజం హబ్గా తీర్చిదిద్దనున్నారు. మొదటిసారిగా ప్రపంచ ప్రఖ్యాత ఇంటర్కాంటినెంటల్, సెయింట్ రీజిస్, ఒబెరాయ్ హోటల్స్ హైదరాబాద్కి రానుండటం విశేషం.
‘హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాదు.. ఇది ఒరిజినల్ సిటీ. ఈ మహా నగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతాం. ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీపడుతోంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి లాభాలు పొందండని పెట్టుబడిదారులకు సూచిస్తున్నా. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ హైదరాబాద్లో ప్రపంచ సుందరీమణుల పోటీలు నిర్వహించాం. శాంతిభద్రతల విషయంలో తెలంగాణ సురక్షితమైన ప్రదేశం. మీ పెట్టుబడులకు ఇక్కడ రక్షణ ఉంటుంది.’ అని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.


