Flight Restaurant in Hyderabad: జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలని చాలా మందికి ఓ కలగా ఉంటుంది. కానీ చాలా మందికి అది సాధ్యంకాకపోవచ్చు.
అలాంటి వారి కోసమే అచ్చం విమాన ప్రయాణ అనుభూతి తలపించేలా ఓ రెస్టారెంట్ ఏర్పాటు చేసి అందులో భోజనాన్ని విక్రయిస్తున్నారు పశ్చిమ గోదావరికి చెందిన వెంకట్రెడ్డి.
హైదరాబాద్లోని గండిమైసమ్మ వద్ద టెర్మినల్-1 ఫ్లైట్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ రెస్టారెంట్.. కస్టమర్స్ కు అచ్చం విమాన ప్రయాణ అనుభూతిని అందిస్తోంది. ఈ రెస్టారెంట్ విమాన ప్రయాణ పద్దతులను పాటిస్తూ.. అతిథులకు మంచి కిక్ ఇస్తోంది. లోపలికి రాగానే పాస్పోర్ట్, వీసా తనిఖీలా చెక్-ఇన్ ప్రక్రియతో బోర్డింగ్ పాస్ అందించటమే కాకుండా.. ఎయిర్ హోస్టెస్లా ఉన్న సిబ్బంది స్వాగతం పలుకుతూ సీట్స్ చూపిస్తూ గైడ్ కూడా చేస్తారు. సీట్ బెల్ట్ పెట్టమని సూచిస్తారు. వెల్కమ్ పానీయాలు, ఆర్డర్ చేసిన భోజనం అందిస్తారు.
ధర కూడా తక్కువే..
రూ.599 ధరతో ఈ వినూత్న భోజన అనుభవం ఆహార ప్రియులను ఆకర్షిస్తోంది. రద్దీ సమయంలో వెయిటింగ్ లాంజ్లు అందుబాటులో ఉన్నాయి. దేశంలోనే తొలి విమాన రెస్టారెంట్గా, ఇది అతిథులకు విమాన ప్రయాణ థ్రిల్ను అందిస్తూ, జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభవాన్ని అందిస్తోంది. బోర్డింగ్ నుంచి ల్యాండింగ్ వరకు.. 45 నిమిషాల అనుభవంతో ల్యాండింగ్ అనౌన్స్మెంట్తో ప్రయాణం పూర్తవుతుంది.
ఓ తుక్కు దుకాణం నుంచి..
పశ్చిమ గోదావరికి చెందిన వెంకట్రెడ్డి దాదాపు రూ.50 లక్షలతో ఈ రెస్టారెంట్ను ఏర్పాటు చేశారు. మలేషియాలో ఓ తుక్కు దుకాణం నుంచి రూ.35 లక్షలకు ఈ విమానాన్ని కొనుగోలు చేసి, దానిని రెస్టారెంట్గా మార్చారు. వినియోగదారులకు స్టిములేషన్ తో ఎగిరే అనుభూతి కలిగిస్తున్నట్లు ఆయన తెలిపారు.


