GEO- AI Workshop in VNR- VJIET: ఏఐ టెక్నాలజీ ఇప్పటికే దాదాపు అన్ని రంగాల్లో ప్రవేశించింది. దీంతో సమయం ఆదా కావడంతో పాటు పనుల్లో వేగవంతం పెరిగింది. ఈ క్రమంలో ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లోనూ విద్యార్థులకు ఏఐ టెక్నాలజీ ప్రాధాన్యత తెలుపుతూ అందుకు అనుగుణంగా నైపుణ్యాలను అప్గ్రేడ్ చేసుకోవాలని ప్రొఫెసర్లు సూచిస్తున్నారు. హైదరాబాద్లోని ప్రముఖ వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ(VNR VJIET) లో AI ఆధారిత భూభౌగోళిక డేటావిశ్లేషణపై మూడు రోజుల వర్క్షాప్ నిర్వహించారు.


వీఎన్ఆర్- వీజేఐటీ విద్యాసంస్థలో “Unlocking the Power of Geo-AI” అనే అంశంపై మూడు రోజుల ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించారు. భౌగోళిక డేటాపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఎలా ఉపయోగించాలనే అంశంపై ఈ వర్క్షాప్లో అండర్గ్రాడ్యుయేట్, పోస్ట్గ్రాడ్యుయేట్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. థియరీ, ప్రాక్టికల్ పరంగా విద్యార్థులకు శిక్షణ అందించారు. ఈ వర్క్షాప్ ADRIN (అడ్వాన్స్డ్ డేటా ప్రాసెసింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్), సికింద్రాబాద్, వీఎన్ఆర్ వీజెఐఈటీ నిపుణుల నేతృత్వంలో జరిగింది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా GEO రంగంలో ఏఐ ప్రాధాన్యతను ప్రాక్టికల్గా అర్థం చేసుకోవడానికి, నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి విద్యార్థులకు ఇది ఒక గొప్ప అవకాశం.

గత రెండు రోజులుగా విద్యార్థులు మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, రిమోట్ సెన్సింగ్ పరంగా ప్రాథమికంగా అధ్యయనం చేశారు. అనంతరం QGIS/ArcGIS, ఫారెస్ట్రీలో Geo-AI అప్లికేషన్లపై విశ్లేషణాత్మకమైన సెషన్లు నిర్వహించారు. ఈ వర్క్షాప్లో విద్యార్థులు నేర్చుకున్న అంశాలను డేటా మోడలింగ్, AI ఆధారిత స్పేషియల్ ఎస్టిమేషన్స్ భౌగోళిక డేటాసెట్ల విజువలైజేషన్లో అన్వయించేందుకు విద్యార్థులను బృందాలుగా విభజించి ప్రోత్సహించారు.

‘ఈ వర్క్షాప్ ద్వారా విద్యార్థులకు భౌగోళిక రంగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రూపాంతర శక్తిని పరిచయం చేయాలనే లక్ష్యంతో మేము ముందుకు వచ్చాం. థియరీని రియల్ అప్లికేషన్స్తో కలిపి, పర్యావరణ, పట్టణ, సామాజిక సమస్యలను AI ఎలా పరిష్కరించగలదో విద్యార్థులు అర్థం చేసుకోవాలి. విద్యార్థుల్లో కేవలం బుక్స్లో ఉన్నది కాకుండా, విశ్లేషణాత్మకంగా ఆలోచించగలగడం, ఆధునిక సాధనాలను ఉపయోగించడం, డేటా ఆధారిత అంతర్దృష్టులతో ఆవిష్కరణ చేయగలగడం వంటి నైపుణ్యాలను అభివృద్ధి చేయడమే మా లక్ష్యం.’ వీఎన్ఆర్- వీజేఐఈటీ సివిల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ డా. కె. రవి కుమార్ స్పష్టం చేశారు.

ఈ వర్క్షాప్ ద్వారా విద్యార్థులు Geo-AI లో బలమైన సాంకేతిక పునాది ఏర్పరుచుకోవచ్చని ప్రొఫెసర్ డా. కె. రవి కుమార్ స్పష్టం చేశారు. డేటా ప్రీప్రాసెసింగ్, అల్గారిథమిక్ మోడలింగ్, శాటిలైట్ డేటా అనాలసిస్ వంటి ప్రాక్టికల్ నైపుణ్యాలను అభ్యసిస్తున్నారని చెప్పారు. ఈ నైపుణ్యాలు వారి అకడమిక్ పరిశోధనకు తోడ్పడటమే కాకుండా, డేటా సైన్స్, పర్యావరణ విశ్లేషణ, భౌగోళిక ఇంటిలిజెన్స్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుస్తాయని భావించారు. చివరి రోజు ప్రాజెక్టుల పూర్తి, మూల్యాంకనం నిర్వహిస్తాం. ఉత్తమంగా ప్రదర్శించిన విద్యార్థుల బృందాలకు గుర్తింపు పత్రాలను అందించామని ప్రొఫెసర్ డా. కె. రవి కుమార్ వివరించారు.
Also Read: https://teluguprabha.net/telangana-district-news/hyderabad/hyderabad-open-air-cinema-trend/


