Hyderabad : హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను సరళీకరించేందుకు కొత్త చర్యలు చేపడుతున్నట్లు సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. నగరంలో రోజురోజుకూ వాహనాల రద్దీ పెరుగుతోందని, 650 జంక్షన్లలో ట్రాఫిక్ నిర్వహణ సవాలుగా మారిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం పోలీస్ శాఖకు ఎన్ని వాహనాలు ఇచ్చినా సరిపోవని, అందుకే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ (పీపీపీ) ద్వారా వాహనాలు సమకూరిస్తే మరింత మెరుగైన సేవలు అందించగలమని ఆయన వెల్లడించారు.
ALSO READ: CM Chandrababu : సమాజ సేవలోనే నిజమైన సంతోషం – సీఎం చంద్రబాబు
హైదరాబాద్లో సగటు వాహన వేగం 18 కి.మీ నుంచి 23 కి.మీకి పెరిగినట్లు సీవీ ఆనంద్ తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ట్రాన్స్జెండర్లను ట్రాఫిక్ నిర్వహణలో నియమించినట్లు ఆయన గర్వంగా చెప్పారు. ఈ ట్రాఫిక్ మార్షల్స్ స్థానిక పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్సైల పర్యవేక్షణలో పని చేస్తారని, రాబోయే రోజుల్లో వారి సంఖ్య 500కు పెరగవచ్చని ఆయన అంచనా వేశారు. ఈ మార్షల్స్ బాధ్యతాయుతంగా వ్యవహరించి, ట్రాఫిక్ విభాగానికి మంచి పేరు తేవాలని ఆయన కోరారు.
ట్రాఫిక్ పెట్రోలింగ్ బైక్లకు డాష్బోర్డు కెమెరాలు, సిబ్బందికి బాడీవేర్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు సీవీ ఆనంద్ వివరించారు. ఈ కెమెరాలు ట్రాఫిక్ నిర్వహణలో పారదర్శకతను పెంచుతాయని, సీసీటీవీలతో కలిపి నగరంలో భద్రతను మెరుగుపరుస్తాయని ఆయన తెలిపారు. ఈ చర్యలు హైదరాబాద్ను మరింత సురక్షిత, సమర్థవంతమైన నగరంగా మార్చడానికి దోహదపడతాయని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.


