IRCTC Booking Rules: అక్టోబర్ 1, 2025 నుంచి రైల్వే సంస్థ సాధారణ లేదా జనరల్ టిక్కెట్ల రిజర్వేషన్ విధానంలో కీలక మార్పులు అమల్లోకి తెస్తోంది. ఇకపై IRCTC వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా టికెట్ బుకింగ్ ప్రారంభమైన తొలి 15 నిమిషాల సమయంలో ఆధార్ ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేసుకున్న వినియోగదారులకే రిజర్వేషన్ టిక్కెట్ల రిజర్వేషన్ కోసం అవకాశం లభిస్తుంది. ఆధార్ లింక్ చేయని యూజర్లు మాత్రం 15 నిమిషాల తర్వాతే బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది రైల్వే సంస్థ.
రైల్వే శాఖ చెబుతున్నదాని ప్రకారం, ఈ చర్య టిక్కెట్ మాఫియాలను, బల్క్ బుకింగ్ మోసగాళ్లను అరికట్టడానికే తీసుకురాబడింది. ఇప్పటివరకు తత్కాల్ టికెట్ల బుకింగ్లో ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి కాగా.. ఇప్పుడు అదే విధానం సాధారణ రిజర్వేషన్ టికెట్లకూ విస్తరించబడింది. ఫలితంగా నిజమైన ప్రయాణికులకే త్వరగా టికెట్లు పొందటానికి వీలు ఉంటుందని రైల్వేస్ చెబుతోంది.
కొత్త రూల్ ప్రయోజనాలు సామాన్యులకు ఏంటి?
* తొలి 15 నిమిషాల్లో ఆధార్ ధృవీకరణ కలిగిన యూజర్లు మాత్రమే బుక్ చేయగలరు.
* ఆధార్ లింక్ చేయని వారికి 15 నిమిషాల తర్వాతే స్లాట్స్ ఓపెన్ అవుతాయి.
* అధికారిక టికెట్ ఏజెంట్లు, PRS కౌంటర్ల ద్వారా బుక్ చేసుకునే వారికి ఈ నియమాలు వర్తించవు.
* ఏజెంట్లకూ తొలి 15 నిమిషాలు ఆన్లైన్ బుకింగ్ హక్కు ఉండదు.
ప్రయాణికులకు సూచనలు..
* ముందుగానే IRCTC ఖాతాను ఆధార్తో లింక్ చేసి ధృవీకరణ పూర్తి చేసుకోండి.
* టికెట్ బుకింగ్ సమయంలో సులభంగా సీటు దొరికేలా ఈ మార్పులు ఉపయోగపడతాయి.
* నిజమైన అవసరం ఉన్న ప్రయాణికులు అకారణంగా టికెట్ మాఫియాల కారణంగా నష్టపోకుండా రైల్వే భరోసా.
పండక్కి రైలు ప్రయాణం కోసం ప్లాన్ చేస్తున్న ప్రతి ఒక్కరూ టిక్కెట్ బుక్కింగ్ కోసం వెళ్లటానికి మునుపే.. తమ IRCTC అకౌంట్ను ఆధార్తో లింక్ చేసుకోవటం తప్పనిసరని గుర్తుంచుకోవాలి. అక్టోబర్ 1 నుంచి అమలులోకి వచ్చే ఈ కొత్త విధానం రైలు ప్రయాణాన్ని మరింత పారదర్శకంగా, సులభంగా మార్చనుందని రైల్వే శాఖ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.


