KTR Borabanda Road Show : తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం రోజు రోజుకూ వేడి పెంచుతోంది. ప్రచారంలో భాగంగా BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బోరబండలో రోడ్ షోలో నిర్వహించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించాడు.
జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి కేటీఆర్.. “హిట్లర్లాంటి పెద్ద వారే చరిత్రలో కలిసిపోయారు. ఇక నువ్వెంత!” అంటూ రేవంత్ పై విరుచుకుపడ్డారు. BRS అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ప్రచారం చేస్తూ, “సునీతకు కేసీఆర్, కేటీఆర్, విష్ణువర్ధన్ రెడ్డి అండగా ఉన్నారు” అని హామీ ఇచ్చారు.
“సునీత ఒక ఆడపిల్ల. ఆమె కష్టం వచ్చినప్పుడు బయటకు వస్తుందా? కానీ మేము గెలిస్తే అంతా అండగా ఉంటాము. తెలంగాణ భవనం పక్కనే ఉంది. అర్ధరాత్రి ఫోన్ చేస్తే అరగంటలో మా ముందు ఉంటాము” అని బ్లాక్ మెయిల్ చేసి ఓట్లు వేయించుకోవాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
రేవంత్ రెడ్డి ఓటు వేయకుంటే పథకాలు రద్దు చేస్తామని బెదిరిస్తున్నారని, అది రేవంత్ సొంత డబ్బుతో ఇస్తున్నారా అని ప్రశ్నించారు. “హైడ్రా బాధితులను చూస్తే ప్రతి ఒక్కరి కళ్ల వెంట నీళ్లు వస్తాయి. పేదల ఇళ్లు కూల్చి, హైడ్రా అనే రాక్షసి మాయతో జీవితాలు నాశనం చేస్తున్నారని” ఆవేదన వ్యక్తం చేశారు. కూకట్పల్లి, శేరిలింగంపల్లిలో బుల్డోజర్ రేపు జూబ్లీహిల్స్కు రాకుండా ఉండాలంటే సునీతను గెలిపించాలని ప్రజలను కోరారు. “ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ నాయకులు వస్తే గల్లా పట్టి నిలదీస్తాము” అని హెచ్చరించారు.
కేసీఆర్ తిరిగి రాష్ట్రానికి నాయకత్వం వహించాలని ప్రజలు కోరుకుంటున్నారని కేటీఆర్ తెలిపారు. “కాంగ్రెస్ హామీలు ఇచ్చి రెండేళ్లు గడుస్తున్నా అమలు చేయడం లేదు” అని విమర్శించారు. రేవంత్కు ఒక్క అవకాశం ఇచ్చినందుకు పేదల ఇళ్లు కూల్చి, హైడ్రాతో ప్రజలను ఏడిపిస్తున్నారని తెలిపారు. “కారు గుర్తుకు ఓటు వేసి సునీతను గెలిపించాలి” అని పిలుపునిచ్చారు. ఈ రోడ్ షోలో BRS నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.


