Osmania University : తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శన సందర్బంగా విద్యార్థులను ముందస్తుగా అరెస్టు చేయడం పట్ల బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యను అప్రజాస్వామికమని, పిరికిపంద చర్యగా విమర్శలు గుప్పించారు. వెంటనే అరెస్టయిన విద్యార్థులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ALSO READ: Revanth Reddy OU Visit : హైటెన్షన్.. మరికాసేపట్లో ఉస్మానియాకు సీఎం రేవంత్
హరీశ్ రావు మాట్లాడుతూ, ఒక్క విద్యార్థి మీద కూడా పోలీసు లాఠీ పడితే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. విద్యా, హోం శాఖలను తన వద్ద పెట్టుకుని ఇలాంటి చర్యలు చేపట్టడం సరికాదని అన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు ప్రభుత్వం ఇచ్చిన మోసపూరిత హామీల గురించి నిలదీస్తుంటే, మొత్తం తెలంగాణ సమాజంపై నిషేధాజ్ఞలు విధించాలా అని ప్రశ్నించారు.
ప్రజాస్వామ్య పాలన అని చెప్పి ఎమర్జెన్సీ రోజులను తిరిగి తెచ్చారని రేవంత్ రెడ్డిని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇవ్వడం, ఓయూలో శంకుస్థాపన చేసిన నిర్మాణాలను ప్రారంభించడం తప్ప 22 నెలల్లో ఏమీ చేయలేదని ఆరోపించారు.
జాబ్ క్యాలెండర్ను జాబ్లెస్ క్యాలెండర్గా మార్చారని, మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాల హామీని మోసం చేశారని, నిరుద్యోగ భృతి పేరిట వంచన చేశారని విమర్శించారు. 22 నెలల్లో 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా రూ. 60 వేలు ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.
తప్పుడు ప్రచారంపై విద్యార్థులు, నిరుద్యోగులు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని, నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తుంటే ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రంథాలయాల్లో లాఠీ చార్జీలు, విద్యార్థులపై అమానుష చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. ఆంక్షలు, నిషేధాలతో నిరసనలను అణచలేరని, ఇనుప కంచెలు, బ్యారికెడ్లతో ప్రజా తిరుగుబాటును ఆపలేరని అన్నారు. ఉస్మానియా విద్యార్థులు సింహాల్లా గర్జిస్తారని, మోసాన్ని నిలదీస్తారని చెప్పారు.
మోసం చేసినందుకు ఉస్మానియా సాక్షిగా విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని, ఎన్నికల మేనిఫెస్టో హామీలను వెంటనే అమలు చేయాలని బిఆర్ఎస్ తరఫున డిమాండ్ చేశారు. ఈ ఘటన తెలంగాణలో ఉద్యోగాలు, విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం వైఖరిని ప్రశ్నిస్తోంది. ప్రభుత్వం స్పందన ఎలా ఉంటుందో చూడాలి.


