RTC Charges Hike Hyderabad Secunderabad: దసరా పండుగ సందర్భంగా బస్సు ఛార్జీలు పెంచిన టీజీఎస్ఆర్టీసీ.. పండుగ అనంతరం ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ ఇచ్చింది. జంటనగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో తిరిగే ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు పెంచుతున్నట్లు తెలిపింది. ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఈ- ఆర్డినరీ, ఈ- ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఛార్జీలు పెరగనున్నాయి. సోమవారం నుంచే(అక్టోబర్ 6) ఈ పెరిగిన ఛార్జీలు అమల్లోకి వస్తాయని ఆర్టీసీ ప్రకటించింది.
పెంపు వివరాలు ఇలా..
సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, ఈ-ఆర్డినరీ, ఈ-ఎక్స్ప్రెస్ బస్సుల్లో మొదటి మూడు స్టేజీల వరకు రూ. 5 పెంచనున్నారు. 4వ స్టేజి నుంచి ప్రస్తుతం ఉన్న టికెట్పై రూ. 10 అదనపు ఛార్జీ వసూలు చేయనున్నారు. మెట్రో డీలక్స్, ఈ-మెట్రో ఏసీ సర్వీసుల్లో మొదటి స్టేజీకి ఆర్టీసీ రూ. 5 పెంచింది. రెండో స్టేజీ తర్వాత అదనంగా రూ.10 ఛార్జీ వసూలు చేయనున్నచ్లు ఆర్టీసీ తెలిపింది. కాగా, ఆర్టీసీ కొత్త ఎండీగా నాగిరెడ్డి బాధ్యతలు స్వీకరించిన 4 రోజులకే ఆర్టీసీ ఛార్జీల పెంపు నిర్ణయం చేసింది.
Also Read: https://teluguprabha.net/telangana-news/telangana-destination-wedding-hub-new-tourism-projects/
కాగా, ఆర్టీసీ ఛార్జీల పెంపు వెనుక ఓ కీలక కారణం ఉందని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల దశల వారీగా రాబోయే రెండేళ్లలో 2,800 ఎలక్ట్రిక్ బస్సులను డీజిల్ బస్సుల స్థానంలో ప్రవేశపెట్టాలని ఆర్టీసీ సంస్థ భావిస్తోంది. ఇందుకోసం మరో 10 డిపోలను అదనంగా ఏర్పాటు చేయాలని.. వాటికి 10 ఛార్జింగ్ స్టేషన్లు అవసరం అవుతాయని అంచనా. ఈ క్రమంలో డిపోలు, ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, వాటి నిర్వహణ కోసం ఛార్జీలు పెంచాల్సి వస్తోందని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటనలో తెలిపింది. ఇందుకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

