హైదరాబాద్ హైటెక్స్ వేదికగా జరగిన మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలే పోటీలు వైభవంగా జరిగాయి. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన అందాల రాణుల పోటీ మధ్య విభిన్న ప్రతిభ కనబరిచిన థాయ్లాండ్ సుందరి ఓపల్ సుచాత సువాంగ్శ్రీ అఖిల ప్రపంచ సుందరిగా నిలిచారు. దీంతో 72వ మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకున్న ఆమె, అత్యుత్తమ సమాధానం, ఆత్మవిశ్వాసం, సామాజిక బాధ్యతతో అందరి మనసులను గెలుచుకున్నారు.
ఈ గౌరవం పొందిన ఓపల్కి రూ.8.5 కోట్ల నగదు బహుమతి, విలువైన 1,770 వజ్రాలు పొదిగిన మిస్ వరల్డ్ కిరీటం, ఏడాది పాటు ప్రపంచ యాత్రకు ఉచితంగా అవకాశం లభించింది. ఈసారి టాప్-4లో మార్టినిక్, ఇథియోపియా, పోలెండ్, థాయ్లాండ్ దేశాల భామలు నిలవగా… వారి మధ్య జరిగిన క్వశ్చన్-ఆన్సర్ రౌండ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. చివరికి ఓపల్ సుచాత ఇచ్చిన భావగర్భిత సమాధానం ప్రేక్షకులను, జడ్జీలను అలరిచి కిరీటాన్ని ఆమెకే కట్టించింది.
1వ రన్నరప్గా మిస్ పోలెండ్, 2వ రన్నరప్గా మిస్ పోలాండ్ , 3వ రన్నరప్గా మిస్ మార్టినిక్ నిలిచారు. ఈ ముగ్గురూ సైతం గొప్ప ప్రదర్శన ఇచ్చినప్పటికీ, చివరి అంకంలో ఓపల్ నిలకడగా మెరుపులు మెరిపించారు. థాయ్లాండ్లోని ఫుకెట్ ప్రాంతంలో జన్మించిన ఓపల్ సుచాత, చిన్ననాటి నుంచే మోడలింగ్ పట్ల ఆసక్తి కనబర్చారు. ఆమె అందం మాత్రమే కాదు, ఆలోచనల్లో స్పష్టత, నిబద్ధత కూడా ఆమెను ఈ కిరీటానికి అర్హత కలిగించాయి. ఈ విజయం ద్వారా థాయ్లాండ్ ప్రపంచ వేదికపై మరోసారి తన ముద్ర వేసింది. ఇక మిస్ వరల్డ్గా ఓపల్ తన ప్రస్థానాన్ని ఎలా కొనసాగిస్తుందో చూడాలని ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.