Bhagyalakshmi Scheme Hoax : ఒక్కసారిగా వందలాది మంది మహిళలు పరిగిలోని పోస్టాఫీసు ఎదుట బారులు తీరడంతో స్థానికంగా కలకలం రేగింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడకపోయినా, పోస్టాఫీసు సిబ్బంది సైతం సమాచారం ఇవ్వకపోయినా, మహిళలు పెద్ద ఎత్తున తరలిరావడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఇంతకీ అసలు విషయమేమిటంటే..
అసలు కథేంటి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ‘భాగ్యలక్ష్మి’ పథకం కింద అర్హులైన మహిళల ఖాతాల్లో రూ. 2,500 జమ అవుతోందంటూ స్థానికంగా పుకార్లు షికార్లు చేశాయి. ఈ వదంతులు వ్యాపించడంతో, ఆ డబ్బులు పొందేందుకు మహిళలు పోస్టాఫీసులో ఖాతాలు తెరిచేందుకు ఉదయాన్నే క్యూ కట్టారు. పసిపిల్లలను చంకనేసుకుని, గంటల తరబడి ఎండలో నిలబడటంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది.
అధికారుల స్పందన : విషయం తెలుసుకున్న తపాలా శాఖ సిబ్బంది, ఇది కేవలం వదంతులు మాత్రమేనని, ‘భాగ్యలక్ష్మి’ పథకానికి సంబంధించి తమకు ఎలాంటి సర్క్యులర్ అందలేదని స్పష్టం చేశారు. సరైన సమాచారం కోసం ప్రజలు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లు, ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని వారు విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ ఘటనతో తమ శాఖలో ఖాతాల సంఖ్య పెరగడం పట్ల సిబ్బంది ఆనందం వ్యక్తం చేయడం గమనార్హం.

