బెట్టింగ్ ప్రమోషన్ సెలబ్రిటీలకు కొత్త కష్టాలు తెచ్చి పెడుతున్నాయి. ఈ వ్యవహారంలో ఒకరి తర్వాత ఒకరు విచారణకు హాజరవుతున్నారు. తాజాగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ప్రముఖ యూట్యూబర్ రీతూ చౌదరి విచారణకు హాజరయ్యింది. దీంతో పోలీసులు రీతూని విచారించారు. మరోవైపు, రీసెంట్ గా సే నో టు బెట్టింగ్ యాప్స్ అంటూ ఆమె వీడియో విడుదల చేశారు. గతేడాది తాను ప్రమోషన్ చేశానని, ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయని చెప్పింది. తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశానని ఆమె తెలిపారు. ఇప్పుడు ఇదే వ్యవహారంలో రీతూ చౌదరి పోలీసుల ఎదుట హాజరయ్యారు.
ఇటు విష్ణుప్రియ కూడా పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఆమె స్టేట్ మెంట్ ను నమోదు చేసిన పోలీసులు సంచలన విషయాలను రాబట్టారు. మొత్తం 15 బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినట్లు గుర్తించారు. ఒక్కో ప్రమోషన్ కు 90 వేల రూపాయలు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో అంగీకరించారు. ఇన్ స్టాగ్రామ్ వేదికగా విష్ణుప్రియ బెట్టింగ్ ప్రమోషన్ చేసినట్లు గుర్తించారు. ఎంత డబ్బు తీసుకున్నారు? ఏ ఖాతాకు ఆ నగదును బదిలీ చేశారు? అనేదానిపై ఆమె బ్యాంక్ స్టేట్ మెంట్ తీసుకున్నారు. విచారణ తర్వాత విష్ణుప్రియ మొబైల్ ఫోన్ ను సీజ్ చేశారు.
ఈ కేసులో ఇప్పటికే టేస్టీ తేజ, కానిస్టేబుల్ కిరణ్ ను విచారించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిపై హైదరాబాద్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో 11 మంది సినీ సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు 25 మందిపై కేసులు నమోదు చేశారు. గతంలో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసి ఇన్ ఫ్లుయెన్స్ చేసిన వారిపై పోలీసులు సీరియస్ గా ఉన్నారు. పంజాగుట్ట పీఎస్ లో 11 మందిపై కేసులు నమోదు చేసి, ఒక్కో తేదీ ఇచ్చి విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇచ్చారు.