ATM Robbery: దొంగల ఆగడాలతో హైదరాబాద్ నగరం హడలెత్తుతోంది. గత కొంత కాలంగా రాజకీయ, సినీ ప్రముఖుల ఇండ్లను సైతం దొంగలు వదలడం లేదు. ఇక యథేచ్ఛగా ఏటీఎంలు, సామాన్యుల ఇళ్లకు కన్నాలు వేసి మరీ చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా జీడిమెట్లలో బుధవారం తెల్లవారుజామున నలుగురు గుర్తు తెలియని అగంతకులు వరుసగా మూడు ఏటీఎంల్లో దొంగతనం చేశారు. జీడిమెట్ల, రావిరాల, మైలార్దేవ్ పల్లిలో మూడు ఏటీఎంలను పగులగొట్టి డబ్బులు అపహరించారు. ఓపెన్ కాని బాక్సును వారితో పాటు తీసుకెళ్లారు. వీరు వచ్చిన దృష్యాలు సీసీ ఫుటేజీల్లో రికార్డు అయ్యాయి.
మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పీఎస్ పరిధిలోని గాజులరామారంకు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న మార్కండేయ నగర్ ఎటీఎంలో దొంగలు పడ్డారు. ముసుగు వేసుకొని వచ్చిన దుండగులు చోరీకి తెగబడ్డారు. ఆ ప్రాంతంలో పోలీసులు కార్డన్ సర్చ్, స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 24 గంటలు గడవకముందే అదే ప్రాంతంలో ఉన్న హెచ్డీఎఫ్సీ ఏటీఎంను దోచుకొని పోలీసులకు సవాల్ విసిరారు. బుధవారం తెల్లవారుజామున సమయంలో దొంగలు ఏటీఎం మిషన్ను గ్యాస్ కట్టర్స్తో కట్ చేసి డబ్బులు ఇన్స్టాల్ చేసే బాక్స్ను ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నామని బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. నలుగురు వ్యక్తులు గ్యాస్ కట్టర్తో రెండు ద్విచక్ర వాహనాలపై వచ్చి అపహరణకు పాల్పడ్డారని డీసీపీ వివరించారు. ఏటీఎంలో ఎంత డబ్బు ఉందో తెలియాల్సి ఉందని, సీసీ ఫుటేజ్ ఆధారంతో నిందితులను పట్టుకుంటామని తెలిపారు.
అయితే, దొంగలు వెళ్లిపోయాక అలారం మోగడంతో పోలీసులు హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు క్లూస్, డాగ్ స్క్వాడ్స్ బృందాలు రంగంలోకి దిగాయి. నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
కాగా కొన్ని రోజుల క్రితం జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 56లోని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో చోరీ జరిగిన విషయం తెలిసిందే. ముసుగు ధరించిన ఓ గుర్తు తెలియని వ్యక్తి ఇంటి వెనుక నుంచి లోనికి చొరబడినట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ కూడా అలర్ట్ కాకపోవడంతో ఆగంతుకుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
డీకే అరుణ కూతురు ఉదయం నిద్రలేచేసరికి ఇంట్లోని పరిస్థితి చాలా చిందరవందరగా మారిపోయినట్లు గమనించారు. వంటగది కిటికీ గ్రిల్ తొలగించి ఉంది. ఇది చూసిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు


