ఇక పోలీస్ స్టేషన్లలో చైల్డ్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు మల్టీ జోన్ -1 ఐ జి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ లో నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన పిల్లల పార్కును ఆవిష్కరించారు.

ఆహ్లాదకరమైన పోలీస్ స్టేషన్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్ ద్వారా జిల్లాలో మంచి పోలీసింగ్ సేవలు అందించే విధంగా రూపకల్పన చేసిన జిల్లా ఎస్పీ సింధు శర్మను ఇందులో సహాయ సహకారాలు అందించిన జిల్లా పోలీస్ అధికారులను ఆయన అభినందించారు. పోలీస్ స్టేషన్ లు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే విధంగా ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రత్యేక స్థలాలను ఏర్పాటు చేశామన్నారు. కుటుంబ సమస్యలపై, వ్యక్తిగత ఇతర బాధాకరమైన పరిస్థితులలో ఎవరైనా పోలీస్ స్టేషన్ కు వచ్చినప్పుడు వారి పిల్లలు అక్కడ ఎలాంటి జంకు లేకుండా సంతోషంగా ఆడుకునేలా ఏర్పాటు చేశామన్నారు. ఈ పార్కులలో పిల్లలు ఇష్టపడే బొమ్మలు సీటింగ్ పిల్లలు ఇష్టంగా ఆడుకునే వస్తువులు ఉంటాయన్నారు. కామారెడ్డి జిల్లాలో 23 పోలీస్ స్టేషన్లలో చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్ లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు కామారెడ్డి జిల్లాలోని ఎనిమిది పోలీస్ స్టేషన్లో ఈ చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్ ప్రత్యేక స్థలాలను ఏర్పాటు చేశామన్నారు.

కామారెడ్డి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని కామారెడ్డి దేవునిపల్లి బిక్కనూరు పోలీస్ స్టేషన్లలో ఎల్లారెడ్డి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఎల్లారెడ్డి సదాశివనగర్ గాంధారి బాన్సువాడ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో బాన్సువాడ బిచ్కుంద పోలీస్ స్టేషన్లలో చైల్డ్ ఫ్రెండ్లీ కార్నర్ ప్రత్యేక స్థలాలను ఏర్పాటు చేశామన్నారు. మిగతా పోలీస్ స్టేషన్లలో సైతం ఏర్పాటు చేసేందుకు రూపకల్పన చేపట్టినట్లు జిల్లా ఎస్పీ సింధూ శర్మ పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లో పార్కుల ఏర్పాటు కామారెడ్డి జిల్లాలోని జిల్లా ఎస్పీ సింధు శర్మ కృషి స్థానిక పోలీస్ అధికారుల సహకారాలతో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

సీసీ కెమరాలు
అనంతరం కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు కంట్రోలింగ్ కమాండెంట్ రూమ్ ను ఐజి ప్రారంభించారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని అన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల క్రైమ్ రేటు తగ్గడంతో పాటు క్రైమ్ కు పాల్పడిన వారినీ సులువుగా పోలీసులు గుర్తించేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. స్థానిక ప్రజలు ముందుకు వచ్చి సీసీ కెమెరాలు వారి వీధులలో, గల్లీలలో, ఇండ్లలో అమర్చుకుంటే నేరాలు తగ్గించవచ్చు అన్నారు. దొంగతనాలు హత్యలు వంటి సంఘటనలు అరికట్టవచ్చు అని తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పలువురు దాతలు సీసీ కెమెరాలు ఏర్పాటు ముందుకు రావడం అభినందనీయమన్నారు. సీసీ కెమెరాలు ఎంత ఎక్కువగా ఉంటే పట్టణమంతా ప్రశాంతంగా ఉంటుందన్నారు అనంతరం పలువురు దాతలను ఐజి సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఎస్పీ సింధు శర్మ అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి, నర్సింహారెడ్డి, కామారెడ్డి పట్టణ సిఐ చంద్రశేఖర్ రెడ్డి, సదాశివ నగర్ సిఐ సంతోష్ కుమార్, దేవునిపల్లి సిఐ రామన్, ఎస్సైలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.