Cabinet Meeting: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై త్వరలో ఆర్డినెన్స్ ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీంతో పాటు అధునాతన గోశాలల ఏర్పాటు, వాటి నిర్వహణపై అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
పంచాయతీ రాజ్ చట్ట సవరణ ద్వారా బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు మీడియాకు వివరించారు. రిజర్వేషన్లపై త్వరలో ఆర్డినెన్స్ ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందన్నారు. అందుకోసమే అసెంబ్లీ ప్రొరోగ్ చేసినట్టు సమాచారం. త్వరలోనే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 30వ తేదీ నాటికి స్థానిక సంస్థల ఎన్నికలను పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.
సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బీసీ డెడికేటెడ్ కమిషన్ నియమించిందని మంత్రి పొంగులేటి వివరించారు. రాష్ట్ర ప్రణాళికా విభాగం ఆధ్వర్యంలో కులగణన చేపట్టింది. వీటి ఆధారంగానే అసెంబ్లీలో 42 శాతం రిజర్వేషన్ల బిల్లును ఆమోదం చేసుకుంది. అందుబాటులో ఉన్న ఎంపిరికల్ డేటా ఆధారంగా జనాభా ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు తదుపరి చర్యలు చేపట్టాలని తీర్మానించింది. బీసీల రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు సర్పంచ్, ఎంపీటీసీలకు మండలం యూనిట్గా.. ఎంపీపీ, జెడ్పీటీసీలకు జిల్లా యూనిట్గా, జెడ్పీ చైర్మన్లకు రాష్ట్రం యూనిట్గా పరిగణిస్తారు. బీసీ రిజర్వేషన్ల పెంపునకు అనుగుణంగా రాష్ట్రంలో అమల్లో ఉన్న పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. త్వరలోనే ఈ చట్టంలో చేయాల్సిన సవరణలకు అవసరమైన చర్యలు చేపడుతుంది.
రాష్ట్రంలో కొత్తగా రెండు ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమిటీ, సెంటినరీ యూనివర్సిటీలకు ఆమోదం తెలిపింది. అమిటీ యూనివర్సిటీలో తెలంగాణ విద్యార్థులకు 50 శాతం అడ్మిషన్లకు అవకాశం కల్పించాలనే నిబంధనను ప్రభుత్వం విధించింది. సంగారెడ్డి జిల్లాలో ఇటీవల రెండు కొత్త మున్సిపాలిటీలు ఏర్పడ్డాయి. కొత్తగా ఏర్పడిన జిన్నారం, ఇంద్రీశం మున్సిపాలిటీల పరిధిలో చేర్చే 18 గ్రామ పంచాయతీలను డీ లిస్టింగ్ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
రాష్ట్రంలో అధునాతన గోశాలల ఏర్పాటు, నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. వచ్చే కేబినెట్ సమావేశంలోపు కమిటీ నివేదికను అందించాలని గడువు నిర్ణయించింది. ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పశుసంవర్థక శాఖ రూపొందించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్, కొత్తగా నిర్మించే గోశాల డిజైన్లను మంత్రివర్గ భేటీలో ప్రదర్శించారు. రాష్ట్రంలో 306 గోశాలలున్నాయి. హైదరాబాద్లో ఎన్కేపల్లి, వెటర్నరీ యూనివర్సిటీ, వేములవాడ, యాదగిరిగుట్టలో అత్యాధునికంగా గోశాలలు నిర్మించాలని నిర్ణయించారు. వీటితో పాటు రాష్ట్రంలో ఉన్న గోశాలల రిజిస్ట్రేషన్లు, వాటి నిర్వహణపై సమగ్ర విధానపత్రం రూపొందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.


