Sunday, June 22, 2025
HomeTS జిల్లా వార్తలుSir You Are Great: ఉపాధ్యాయుడే వ్యాను డ్రైవర్‌గా మారి విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి

Sir You Are Great: ఉపాధ్యాయుడే వ్యాను డ్రైవర్‌గా మారి విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి

Teacher Yakubh:ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రోజు రోజుకు తగ్గుతోంది. కానీ కొన్ని గ్రామాలు, ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయుల చొరవ, ప్రత్యేక దృష్టి కారణంగా అడ్మిషన్లు పెరిగాయి. అలా అడ్మిషన్లు పెరిగేందుకు ఓ పాఠశాల ఉపాధ్యాయుల బృందం వినూత్న ఆలోచన చేసింది. ఆ ఆలోచనను ఆచరణలో పెట్టిన ఆ ఉపాధ్యాయులు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం రాజన్ పల్లిలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు సమీపంలోని రెండు గిరిజన తండాల నుంచి విద్యార్థులు రావడానికి ఇబ్బందిగా మారింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు నిర్వహించిన బడిబాటలో ఆ పాఠశాల ఉపాధ్యాయులు తండాల్లోకి వెళ్లగా ఈ విషయం వారి దృష్టికి వచ్చింది. రవాణా సౌకర్యం ఉంటే తమ పిల్లలను ఆ పాఠశాలకు పంపించేందుకు ఏ ఇబ్బంది లేదని పిల్లల తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు చెప్పారు. అక్కడితో తమకెందుకులే అని ఊరుకోకుండా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయ బృందం చర్చించింది. ప్రైవేట్ స్కూళ్ల మాదిరిగా తమకు ఓ వాహనం ఉంటే బాగుంటుందన్న ఆలోచన చేసింది. అక్కడి విద్యార్థుల కోసం ఆ పాఠశాలకు చెందిన ఎండీ యాకుబ్ అనే ఉపాద్యాయుడు తన సొంత డబ్బు రూ. 1.50లక్షలతో ఒక ఓమిని వాహనాన్ని కొనుగోలు చేశారు. స్వయంగా ఉపాధ్యాయుడు యాకుబ్ డ్రైవర్‌గా మారి ఈ విద్యాసంవత్సరం ఆరంభం నుంచి ఆయా తండాల నుంచి విద్యార్థులను పాఠశాలకు తీసుకొచ్చి, తిరిగి తీసుకెళుతున్నారు. బడిగంట ఎప్పుడు మోగితే అప్పుడు ఇంటికి వెళ్లిపోవాలి అనుకునే పలువురు ఉపాధ్యాయులు ఉన్న ఈ రోజుల్లో ఉపాధ్యాయుడు యాకుబ్ చేస్తున్న సేవలను చూసి సెల్యూట్ చేస్తున్నారు. అంతే కాదు ఆ పాఠశాలలోని ఉపాధ్యాయులంతా కలిసి ఆ వాహనానికి అయ్యే రోజువారీ డీజిల్ ఖర్చులను భరిస్తుండడం విశేషం. ఇలా ఆ పాఠశాల ఉపాధ్యాయులు చేస్తున్న సేవలను పలువురు అభినందిస్తున్నారు.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/bigg-boss-9-telugu-contestants/
‘ప్రైవేట్’ నుంచి ప్రభుత్వ పాఠశాలకు
రాజన్ పల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో గత విద్యా సంవత్సరం 42 మంది విద్యార్థులుండేవారు. ఈనెల 6 నుంచి నిర్వహించిన బడిబాట కార్యక్రమం ద్వారా 25 మంది విద్యార్థులు పెరిగారు. ఈ విద్యాసంవత్సరం కొత్తగా వచ్చిన విద్యార్థులంతా ప్రైవేట్ పాఠశాల నుంచి వచ్చిన వారే కావడం విశేషం. విద్యార్థుల్లో గిరిజనులే అధికంగా ఉండడం గమనార్హం. కాగా రాజన్ పల్లి ఉపాధ్యాయుల మాదిరిగా అందరూ బాధ్యతతో పని చేస్తే విద్యార్థుల సంఖ్య మరింత పెరుగుతుందని కోరుతున్నారు.
ALSO READ: https://teluguprabha.net/national-news/pm-modi-praises-vizag-yogandhra-guinness-record/
ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవడమే లక్ష్యం
పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచుకునేందుకే మా ఉపాధ్యాయులందరి అభిప్రాయం మేరకు రూ. 1.50లక్షలు వెచ్చించి వాహనాన్ని కొనుగోలు చేశా. పాఠశాల సమీపంలోని రెండు తండాలకు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఓ మిత్రుడిని వాహనం కిరాయి కోసం అడిగితే ప్రతి రోజూ రూ.500 నుంచి రూ.1000 వరకు ఖర్చు అవుతుందన్నారు. అదంతా ఎందుకని సొంతంగా వాహనం కొన్నా. విద్యార్థులను ప్రతి రోజూ వారి ఇండ్ల నుంచి తీసుకొచ్చి, తిరిగి ఇండ్ల వద్ద దింపుతున్నా. దీంతో విద్యార్థులకు పాఠశాలకు రావడం సులభతరమైంది. మా ప్రధానోపాధ్యాయుడు, సహచర ఉపాధ్యాయుల సహకారంతో నిర్వహిస్తున్నామని ఉపాధ్యాయుడు యాకుబ్ వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News