kishan Reddy Works KCR Direction: బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిది ఫెవికాల్ బంధమని, ఇది జగమెరిగిన సత్యమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు(టీపీసీసీ) మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇవాళ గాంధీభవన్లో టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒకటేనని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఫాంహౌజ్ నుంచి కేసీఆర్ ఆదేశాలు ఇస్తే ఆయన డైరెక్షన్లోనే కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ర్ట ప్రాజెక్టులను కిషన్ రెడ్డి కావాలనే అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులు పూర్తయితే కాంగ్రెస్కు పేరు వస్తుందనే కుట్రలు చేస్తున్నారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు.
హరీష్ రావు బనకచర్ల గురించి ఏదేదో మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీలో ఈ అంశంపై చర్చకు సిద్ధం కావాలని, సీఎం రేవంత్ చాలెంజ్ చేశారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ నేతలు బనకచర్లపై సిద్ధం కండి అని మహేష్ సవాల్ విసిరారు. ‘అసెంబ్లీలో చర్చ పెడుదాం. ఆధారాలతో సీఎం రేవంత్ బనకచర్లపై అన్నీ బయటపెడుతారు. కేసీఆర్, హరీస్ రావు నీటి వాటాల విషయంలో రాజీ పడ్డారు. మీకు దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రండి.. నాడు ఏమీ చేయలేక ఇప్పుడు ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు’ అని టీపీసీసీ చీఫ్ ఫైరయ్యారు.
ALSO READ: https://teluguprabha.net/telangana-news/telangana-bjp-new-president-ramchander-rao-key-comments/
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులు పూర్తి చేస్తే బీఆర్ఎస్తో పాటు బీజేపీ పార్టీ పని అయిపోతుందని కిషన్ రెడ్డి పదేళ్లుగా అడ్డుకుంటూనే ఉన్నారని
మహేష్ గౌడ్ ఆరోపించారు. నాడు చంద్రబాబు, జగన్తో చెట్టాపట్టాలు వేసుకొని తిరిగింది కేసీఆర్ కాదా అని ఆయన విమర్శించారు. రోజా ఇంట్లో చేపల పులుసు తిని రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని చెప్పింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబుతో దోస్తీ చేసింది కేసీఆర్ కాదా అని నిలదీశారు. అబద్ధాలు మాట్లాడి ప్రజలను మాయ చేసే పనిలో హరీష్ రావు ఉన్నారన్నారు. ప్రజలు నిజాలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఎంత మంది బీసీలను బీజేపీ ఊరడించిందని టీపీసీసీ చీఫ్ ప్రశ్నించారు. రాష్ర్టంలో 52 శాతం ఉన్న బీసీలకు రాష్ర్ట అధ్యక్ష పదవి ఇవ్వకుండా ఓసీలకు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ఖర్గేకు ఏం హోదాలో కవిత లేఖ రాశారో సమాధానం చెప్పాలని మహేష్ కుమార్ డిమాండ్ చేశారు. నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లు కవిత పరిస్థితి ఉందన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ బీసీలకు ఏం చేసింది? స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లు 21 శాతానికి తగ్గించింది కేసీఆర్ కాదా అని ఆయన నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం డిప్యూటీ సీఎం, స్పీకర్ పదవి దళితులకు ఇచ్చామని, పీసీసీ పదవి బీసీలకు ఇచ్చిందని గుర్తు చేశారు. సామాజిక న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యం అవుతుందన్నారు. సామాజిక న్యాయంలో భాగంగానే రేపు ఎల్బీ నగర్లో జరిగే సభలో మా అధినాయకులు ఖర్గే ప్రసంగిస్తారన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో చర్చిస్తామన్నారు.