Wednesday, September 25, 2024
Homeతెలంగాణ35,000 new jobs again: త్వరలో మరో 35 వేల ఉద్యోగాలు

35,000 new jobs again: త్వరలో మరో 35 వేల ఉద్యోగాలు

ఇంజినీరింగ్ కాలేజీలకు సీఎం హెచ్చరిక

ప్రపంచానికి నైపుణ్యమున్న యువతను అందించాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ ను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చటంతో పాటు… నైపుణ్యాల అభివృద్ధి చిరునామాగా తీర్చిదిద్దుతామని అన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఉపయోగపడే సాంకేతిక నైపుణ్యాలు నేర్పించే గమ్యస్థానంగా హైదరాబాద్ ను విశ్వ వేదికపై నిలబెట్టేందుకు అందరి సహకారం కావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

- Advertisement -

తెలంగాణలో గత పదేండ్లలో నిరుద్యోగం పెరిగిందని, గత పదేండ్లలో నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించలేదని అన్నారు. టీఎస్పీఎస్సీ వెబ్ సైట్లోనే 30 లక్షల మంది నమోదు చేసుకున్నారని, రాష్ట్రంలో దాదాపు 50 లక్షల మంది నిరుద్యోగులు వీధిన పడే పరిస్థితి వచ్చిందన్నారు. అందుకే రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్య తీవ్రతను ప్రజా ప్రభుత్వం గుర్తించిందని, తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామన్నారు. డీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, తదితర ఉద్యోగాలన్నీ కలిపి మరో 35 వేల ఖాళీల భర్తీ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పారు. రాబోయే రెండు మూడు నెలల్లో మరో 35 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని చెప్పారు.

బుధవారం ఉదయం మాసబ్​ ట్యాంక్​ జేఎన్టీయూ ఆడిటోరియంలో రాష్ట్రంలోని 38 కాలేజీల్లో బీఎఫ్ఎస్ఐ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి, బీఎఫ్ఎస్ఐ కన్సార్టియం ప్రతినిధులు మమతా మాదిరెడ్డి, రమేష్ ఖాజా, ఎక్విప్ సంస్థ ప్రతినిధులు హేమంత్ గుప్తా, జి.సాయికిరణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యమున్న యువతను తయారు చేసి.. ఉపాధికి భద్రత కల్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే బీఎఫ్ఎస్ఐ ప్రతినిధులతో చర్చలు జరిపామని, వారు ఇచ్చిన ప్రతిపాదనలతో ఈ వినూత్న కార్యక్రమం చేపట్టామన్నారు. రాష్ట్రంలో ఇప్పుడు డిగ్రీలో చేరిన పది వేల మంది డిగ్రీ విద్యార్థులు తమ పట్టా పొందే నాటికి నైపుణ్యాన్ని నేర్చుకునేలా ఈ ప్రోగ్రాం రూపకల్పన చేసినట్లు చెప్పారు. ఈ శిక్షణ పొందిన విద్యార్థులకు బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీస్, ఇన్సూరెన్స్ రంగంలో ఉద్యోగాలకు ఢోకా ఉండదని అన్నారు. అవసరమైన నిధులను ఇచ్చేందుకు ముందుకు వచ్చిన ఎక్విప్ సంస్థను, ఈ కోర్సు సిలబస్ను రూపొందించిన బీఆర్ఎస్ఎఫ్ ప్రతినిధులను ముఖ్యమంత్రి అభినందించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

ప్రతిభ ఉన్నా, నైపుణ్యం లేకపోతే యువతకు ఉద్యోగ అవకాశాలు దక్కవని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఏటా మూడు లక్షల మంది విద్యార్థులు డిగ్రీ పట్టాలు పొంది కాలేజీల నుంచి బయటకు వస్తున్నారని, కానీ ఇండస్ట్రీ అవసరాలకు సంబంధించిన నైపుణ్యం లేకపోవడంతో ఉద్యోగాలు పొందలేకపోతున్నారని అన్నారు. అటు పరిశ్రమలకు తమ సాంకేతిక నైపుణ్యమున్న ఉద్యోగుల కొరతను ఎదుర్కుంటున్నాయని అన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందని అన్నారు. అందులో భాగంగానే యువతకు నైపుణ్య శిక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని చెప్పారు.

డిగ్రీలు, ఇంజనీరింగ్ విద్యార్థులకు వచ్చే ఏడాది నుంచి ఇంటర్న్షిప్ కూడా ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జీ కూడా సమకూరుతుందని అన్నారు.

డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఇన్సూరెన్స్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ) రంగాల్లో ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా వినూత్న కోర్సుకు శ్రీకారం చుట్టినట్లు వివరించారు. నాలెడ్జ్‌, కమ్యూనికేషన్ ఉంటేనే మంచి ఉద్యోగాలు వస్తాయని, చదివిన డిగ్రీకి, మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌కు గ్యాప్ ఉంటోందని సీఎం అన్నారు. బీఎఫ్ఎస్ఐకు అవసరమైన స్కిల్స్ నేర్పేందుకు ఈ కోర్సు ప్రారంభిస్తున్నామని చెప్పారు. పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలు అందించే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

గత పదేండ్లలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేనందుకు రాష్ట్రంలో కొంత మంది యువత గంజాయి, డ్రగ్స్ లాంటి వ్యసనాలకు బానిసయ్యారని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల పట్టుబడిన డ్రగ్ పెడలర్స్ లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉండటం ఆందోళన కలిగించిందని అన్నారు. డ్రగ్స్, గంజాయి నియంత్రించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. వ్యసనాల నుంచి యువతను బయటపడేయాలంటే ఉపాధి కల్పించాల్సిన అవశ్యముందన్నారు.

ఇంజినీరింగ్ విద్యార్థులు జాబ్‌ స్కిల్స్ నేర్చుకోవడం లేదని, కొన్ని కళాశాలల్లో అధ్యాపకులు, వసతులు, కనీస ప్రమాణాలు ఉండటం లేదని సీఎం అన్నారు. కళాశాలలు ఇలాగే కొనసాగితే గుర్తింపు రద్దు చేసేందుకు వెనుకాడమని హెచ్చరించారు.

టాటా టెక్నాలజీస్ సహకారంతో ఐటీఐలను అప్ గ్రేడ్ చేసి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నామని, ఇప్పటికే మల్లేపల్లి ఐటీఐలో పైలెట్ ప్రాజెక్టు అమలు చేసినట్లు చెప్పారు. దీంతో ఐటీఐ చదివిన ప్రతి విద్యార్థికి ఉద్యోగం లభిస్తుందని అన్నారు. రాబోయే రెండేళ్లలో రాష్ట్రంలోని అన్నిఐటీఐలను ఏటీసీలుగా మారుస్తామని అన్నారు.

ఇటీవలే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రభుత్వం నెలకొల్పిందని, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాను బోర్డు ఛైర్మన్గా నియమించిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో ఏటా వేలాది మంది యువతకు వివిధ రంగాల్లో జాబ్ గ్యారంటీ కోర్సులు నిర్వహిస్తామని చెప్పారు.

పాలిటెక్నిక్ కాలేజీలను అప్ గ్రేడ్ చేస్తామని అన్నారు. త్వరలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ , స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేసి, తెలంగాణను దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామన్నారు. ఔత్సాహిక క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని వివరించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదివిన వారు ప్రపంచంలోనే పెద్ద సంస్థలకు సీఈవోలుగా ఉన్నారని, అలాంటి వారి సహకారం తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళతామని సీఎం చెప్పారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎక్విప్​ సంస్థ రూ. 2.5 కోట్ల చెక్కును ముఖ్యమంత్రికి అందించింది. విద్యార్థుల డేటాతో రూపొందించిన ఎక్విప్ స్కిల్ పోర్టల్ ను ముఖ్యమంత్రి ఈ వేదికపై ఆవిష్కరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News