New Medicine PG Seats in Telangana: మెడిసిన్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పీజీ వైద్య విద్య సీట్ల భర్తీ విషయంలో వైద్య ఆరోగ్య శాఖ గుడ్ న్యూస్ తీసుకొచ్చింది. 2025- 26 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో మరో 75 పీజీ సీట్లకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్రంలోని కొత్త మెడికల్ కాలేజీల్లోనూ పీజీ సీట్లు కేటాయించినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సౌకర్యాలు మెరుగుపడటంతో 7 కాలేజీల్లో పీజీ సీట్లకు NMC అనుమతి ఇచ్చింది. దీంతో మొత్తం 75 పీజీ సీట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది నుంచే అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయి. అదనపు సీట్ల రాకపోతే ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు వెల్లడించారు.
కాగా, తాజాగా పీజీ సీట్ల పెంపుతో రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1,390 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో 1,789 పీజీ సీట్లు ఉన్నాయి. సీట్ల పెంపు నిర్ణయంతో పీజీ మెడికల్ ఎడ్యుకేషన్ మరింత బలోపేతం కానుంది. అనస్తీషియాలజీ, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, గైనకాలజీ వంటి కీలక డిపార్ట్మెంట్లలో భవిష్యత్తులో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత తీరనుంది.

NMC కేటాయించిన సీట్ల వివరాలు
- గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, నల్గొండ- 19
- గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, రామగుండం- 16
- గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, సూర్యాపేట- 16
- గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, సిద్దిపేట- 8
- గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, మహబూబ్నగర్- 4
- గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, నిజామాబాద్- 8
- ఉస్మానియా మెడికల్ కాలేజ్, హైదరాబాద్- 4


