97 Senior citizens voted from home: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటింగ్ ఈ నెల 11వ తేదీన జరగనుండగా 97 మంది ఓటర్లు ముందస్తుగానే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 85 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు, దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు వేసే సౌకర్యాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించిన విషయం తెలిసిందే. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా హోం ఓటింగ్కు మొత్తం 103 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారికి ఈ నెల 4, 6వ తేదీల్లో రెండు విడతలుగా హోం ఓటింగ్ జరిపేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయగా.. మంగళవారం భారీ పోలీసు బందోబస్తు నడుమ 97 మంది ఓటర్లు ఇంటి వద్దనే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
హోం ఓటింగ్ను పర్యవేక్షించిన రజనీకాంత్రెడ్డి: ఉదయం 7 గంటలకే హోం ఓటింగ్ జరిపే నివాసాల వద్ద పోలింగ్ బూత్ ఎలా ఉండాలో అలాంటి సౌకర్యాలన్నీ ఎన్నికల అధికారులు కల్పించారు. స్థానిక పోలీసులు బందోబస్తు నడుమ ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. నియోజకవర్గ ఎన్నికల అధికారి రజనీకాంత్రెడ్డితో పాటు ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు.. హోం ఓటింగ్ను పర్యవేక్షించారు. మిగతా వారు ఈ నెల 6వ తేదీన హోం ఓటింగ్లో పాల్గొననున్నారని ఎన్నికల అధికారులు తెలిపారు. అందుకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అయితే ఒకే రోజు 97 మంది హోం ఓటింగ్లో పాల్గొనడం ఇదే మొదటిసారి.
Also Read:https://teluguprabha.net/telangana-news/janasena-supports-to-bjp-in-jubilee-hills-by-elections/
ఇద్దరు ఓటర్ల మృతి: హోం ఓటింగ్లో పాల్గొనేందుకు నియోజకవర్గంలో దరఖాస్తు చేసుకున్న 80 సంవత్సరాల పైబడిన సీనియర్ సిటిజన్స్లో ఇద్దరు ఓటింగ్కు ముందే మృతి చెందినట్టుగా ఎన్నికల అధికారులు తెలిపారు. మంగళవారం ఎన్నికల అధికారులు, సిబ్బంది దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్లకు వెళ్లగా మూడు రోజుల క్రితం ఒకరు మరణించినట్టుగా తేలింది. వారం రోజుల క్రితం మరొకరు మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు వెల్లడించారు. హోం ఓటింగ్కు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఓటింగ్లో పాల్గొనకుండానే వీరు మృతి చెందడంతో ఎన్నికల అధికారులు సైతం కొంత ఆవేదనకు గురయ్యారు. అయితే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నవంబర్ 11న జరగనుంది. 14వ తేదీన కౌంటింగ్ చేసి.. ఫలితాలు విడుదల చేస్తారు.


