మంత్రివర్గ విస్తరణ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి(Telangana Congress)కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. కేబినెట్లో మంత్రి పదవి దక్కిన నేతలు సంతోషంలో ఉండగా.. పదవి ఆశించి భంగపడ్డ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణలో భాగంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నిజామాబాద్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తమకు కచ్చితంగ అవకాశం దక్కుతుందని అనుచరులు, కార్యకర్తలతో చెప్పుకుంటూ వచ్చారు. చివరకు అనూహ్యంగా వారికి అధిష్టానం మొండిచేయి చూపడంతో తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ నేతలను బుజ్జగించడానికి సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్.. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసానికి చేరుకుని చర్చలు జరుపుతున్నారు.
సుదర్శన్ రెడ్డితో చర్చల అనంతరం ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావులతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వారు అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. ఎలాగైన ముగ్గురు నేతలను బుజ్జగించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో అగ్రవర్ణాలకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. ఇంకా మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయని.. సామాజిక సమీకరణలతో త్వరలోనే మరో ముగ్గురికి మంత్రిగా అవకాశం కల్పిస్తామని చెప్పారు.
కాగా చివరి నిమిషంలో కేవలం బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు మాత్రమే కాంగ్రెస్ హైకమాండ్ మంత్రి వర్గ విస్తరణలో అవకాశం కల్పించింది. దీంతో కొత్త మంత్రులుగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంటకస్వామి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు పాల్గొన్నారు. నూతన మంత్రులుగా ప్రమాణం చేసిన నాయకులకు నేతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.