తెలంగాణలో మరో పరువు హత్య కలకలం రేపుతోంది. తన కుమార్తెను ప్రేమిస్తున్నాడనే కారణంతో ఓ యువకుడిని తండ్రి హతమార్చిన ఘటన పెద్దపల్లి(Peddapalli) జిల్లాలో చోటుచేసుకుంది. ముప్పిరితోట గ్రామానికి చెందిన పూరేళ్ల పరశురాములు, జోష్ణ దంపతుల కుమారుడు గురువారం రాత్రి స్నేహితులతో కలసి పుట్టిన రోజు వేడుకలను చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా గుర్తుతెలియని వ్యక్తి గొడ్డలితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలపై అరా తీశారు. అనంతరం ఘటన స్థలాన్ని పెద్దపల్లి డీఎస్పీ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా హత్యకు ప్రేమ వ్యవహారమే కారణం అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తన కుమార్తెతో నడుపుతున్న ప్రేమ వ్యవహారంతోనే తండ్రి హత్య చేసినట్లు సమాచారం.