Asaduddin Owaisi in Jubileehills Elections: జూబ్లీహిల్స్ బైపోల్ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయం వేడెక్కింది. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. అయితే, జూబ్లీహిల్స్ గెలుపులో మైనార్టీ ఓటర్లది కీలక పార్టీ. ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ముస్లిం మైనార్టీలు ఉన్నందున.. వారు ఎవరివైపు మొగ్గుచూపితే వారినే విజయం వరించనుంది. ఈ నేపథ్యంలోనే ఎంఐఎం పార్టీ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ పార్టీ ఎవరికి మద్ధతివ్వనుందే చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎంఐఎం ఛీప్ అసదుద్దీన్ ఓవైసీ ఓ కీలక ప్రకటన చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్లో తమ మద్దతు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కే ఉంటుందని స్పష్టం చేశారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జూబ్లీహిల్స్ బస్తీలు పూర్తిగా వెనుకబడ్డాయని, కనీస సదుపాయాలు కల్పించడంలో బీఆర్ఎస్ విఫలమైంది అని తీవ్ర ఆరోపణలు చేశారు. నియోజక వర్గంలో డ్రైనేజ్ సమస్య, మంచినీటి సమస్యలు అలాగే ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఆ సమస్యలు తీరుతాయని నమ్ముతున్నామని కీలక వ్యాఖ్యలు చేశారు.
15 శాతానికి పడిపోయిన బీఆర్ఎస్ ఓటు బ్యాంక్..
గత అసెంబ్లీ ఎన్నికల్లో 35 శాతం ఓటు షేర్ ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు 15 శాతానికి పడిపోయింది అని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. బీజేపీకి ఓట్ షేర్ ఎందుకు షిఫ్ట్ అయిందా అని చర్చిస్తున్నామని చెప్పారు. తాను ఎప్పుడూ కూడా బీజేపీకి సపోర్ట్ చేయలేదన్నారు. ‘పార్లమెంట్ లో కేవలం 23 మంది ముస్లిం ఎంపీలు మాత్రమే ఉన్నారు. దేశంలో అన్ని కులాలకు ఒక్కో పార్టీ ఉంది. మరి ముస్లింల కోసం మేం మాట్లాడడం తప్పా?’ అని అసదుద్దీన్ ఓవైసీ సూటిగా ప్రశ్నించారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. అభివృద్ధి చేద్దాం. కలిసి రావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరితే కలిసి పనిచేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి చాలా యాక్టివ్ గా పని చేస్తున్నారు. రేవంత్ రెడ్డి లాగా బీఆర్ఎస్ ఆలోచించలేదు. ఓల్డ్ సిటీకి మెట్రో బీఆర్ఎస్ హయాంలో చేయలేదు. కేటీఆర్కు అవగాహన ఉన్నట్టు లేదు. అంతా అయిపోయాక దొంగ ఓట్లు అని చెప్పడం ఏంటి? ఈ ఓట్లు అన్నీ పాతవే.. ఓటర్ లిస్ట్ వచ్చే వరకు ఏం చేశారు? ఎన్నికల్లో సెంటిమెంట్ వర్క్ అవుట్ కాదు.. అభివృద్ధి చేయకుండా.. సెంటిమెంట్ తో ఓట్లు అడగడం ఏంటి?’ అని నిలదీశారు.
పోటీపై రెండు రోజుల్లో నిర్ణయం..
ఎంఐఎం అంటే ఒక ముస్లింలకే పరిమితం కాదు. జూబ్లీహిల్స్లో పోటీ చేయాలా..? వద్దా..? అనే విషయంపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం. గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ రాజ్యాంగానికి పూర్తి విరుద్ధంగా మాట్లాడతారు. బీజేపీ గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్న కాంగ్రెస్కే మా మద్ధతు ఉంటుందని, గతంలోనూ మా పార్టీ నుంచి పోటీచేసి మంచి ఓట్లు సాధించిన యువకుడు నవీన్ యాదవ్కే జూబ్లీహిల్స్ ప్రజలు పట్టం కడతారని జోస్యం చెప్పారు.


