బెట్టింగ్ యాప్స్(Betting Apps) ప్రమోషన్ కేసులో యాంకర్ విష్ణుప్రియ(Vishnu Priya) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదుచేసిన రెండు కేసులను కొట్టివేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇవాళ న్యాయస్థానం విచారణ చేపట్టనుంది. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల(Shyamala) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. ఆమెను అరెస్ట్ చేయవద్దంటూ పోలీసులను ఆదేశించిన సంగతి తెలిసిందే. అలాగే పోలీసుల విచారణకు సహకరించాలని శ్యామలకు సూచించింది. ఈ నేపథ్యంలో ఆమె సోమవారం పంజాగుట్ట పోలీసుల విచారణకు వెళ్లారు.
ఇక ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి విష్ణుప్రియ, రీతూ చౌదరి, టేస్టీ తేజను పోలీసులు విచారించారు. మరోవైపు యూట్యూబర్లు హర్షసాయి, ఇమ్రాన్ ఖాన్ విదేశాల్లో తలదాచుకుంటున్నారని తెలుస్తోంది. కాగా బెట్టింగ్ యాప్స్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న విషయం విధితమే. బెట్టింగ్స్ యాప్స్ను ప్రమోట్ చేసిన టాలీవుడ్ నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లతో కలిపి మొత్తం 25 మందిపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు.