Nitish Kumar’s political strategy : బిహార్ రాజకీయ చదరంగంలో ఆరితేరిన యోధుడు, ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ మరోసారి తనదైన శైలిలో ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. సంక్రాంతి తర్వాత జరగబోయే మంత్రివర్గ విస్తరణ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను తుఫానుకు కేంద్ర బిందువుగా మారింది. భర్తీకి నోచుకోని 9 మంత్రి పదవులు కేవలం ఖాళీలు కావని, విపక్ష ‘ఇండియా’ కూటమిని నిలువునా చీల్చేందుకు నీతీశ్ పన్నిన పకడ్బందీ వ్యూహంలో భాగమని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అసలు నీతీశ్ స్కెచ్ ఏంటి? ఆ 9 మంత్రి పదవుల వెనుక దాగి ఉన్న అసలు కథేంటి? ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు పన్నిన ఈ పద్మవ్యూహంలో చిక్కేదెవరు? ఈ పరిణామాలు జాతీయ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయి?
బిహార్లో అధికార ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించినా, ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ మనసులో ఒక చిన్న వెలితి మిగిలిపోయింది. తన జనతాదళ్ (యునైటెడ్) పార్టీ, మిత్రపక్షమైన బీజేపీ కన్నా తక్కువ స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగా నిలవడం ఆయనకు మింగుడుపడని విషయం. ఈ లోటును పూడ్చుకుని, జేడీయూను అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా నిలపాలన్నదే ఆయన అంతిమ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇందుకు ఆయన ఎంచుకున్న మార్గం.. ‘ఆపరేషన్ ఆకర్ష్’.
మంత్రి పదవుల ‘ఎర’.. అంకెల గారడీ ఇదే :
లెక్కల్లో మర్మం: బిహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలుండగా, నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రితో కలిపి గరిష్ఠంగా 36 మంది మంత్రులు ఉండవచ్చు. కానీ, ప్రస్తుత మంత్రివర్గంలో సీఎంను కలుపుకుని 27 మంది మాత్రమే ఉన్నారు. అంటే మరో 9 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి.
జేడీయూ కోటాలోనే కీలకం: అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ 9 ఖాళీలలో 6 పదవులు జేడీయూ కోటాకు చెందినవే. దీనిని బట్టే నీతీశ్ ఎంత వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారో అర్థమవుతోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పదవులను అక్షయపాత్రలా అట్టిపెట్టి, సరైన సమయంలో విపక్ష ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు ఉపయోగించాలన్నది ఆయన ప్రణాళిక.
గత చరిత్రే నిదర్శనం.. నీతీశ్ పాత వ్యూహమే : ప్రతిపక్ష ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవడం నీతీశ్ కుమార్కు కొత్తేమీ కాదు. ఆయన రాజకీయ ప్రస్థానాన్ని గమనిస్తే ఇలాంటి ఉదంతాలు కోకొల్లలు. 2020 ఎన్నికల తర్వాత, బీఎస్పీ ఏకైక ఎమ్మెల్యే జామా ఖాన్ను, ఎల్జేపీ ఏకైక ఎమ్మెల్యేను జేడీయూలో చేర్చుకుని, జామా ఖాన్కు మంత్రి పదవి కట్టబెట్టారు. 2024లో తన ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నప్పుడు, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకుని ప్రభుత్వాన్ని గట్టెక్కించుకున్న ట్రాక్ రికార్డు ఆయనకుంది. “నీతీశ్ ఎప్పుడూ తన పార్టీని బలోపేతం చేసుకోవడానికే చూస్తారు. ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నారు,” అని రాజకీయ పరిశీలకులు ప్రియరంజన్ భారతి అభిప్రాయపడ్డారు.
తెరపైకి ఐపీ గుప్తా.. చీలికకు తొలి సంకేతమా : నీతీశ్ వ్యూహాలు ఫలిస్తున్నాయనడానికి తొలి సంకేతం ‘ఇండియన్ ఇంక్లూజివ్ పార్టీ’ (IIP) అధినేత, ఎమ్మెల్యే ఐపీ గుప్తా రూపంలో బయటపడింది. మహాకూటమిలో భాగస్వామిగా గెలిచిన ఆయన, ఇప్పుడు ఎన్డీఏ వైపు చూస్తున్నట్లు స్పష్టమైన సంకేతాలిచ్చారు. ఈటీవీ భారత్తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన, “మా పాన్ సామాజిక వర్గానికి రిజర్వేషన్ల డిమాండ్కు సీఎం నీతీశ్ అంగీకరిస్తే, ఆయనతో కలిసి నడిచేందుకు మేం సిద్ధం. మాకు పదవులు ముఖ్యం కాదు, ప్రజల ప్రయోజనాలే ముఖ్యం,” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం ఒక ఎమ్మెల్యే మాటగా కాకుండా, విపక్ష శిబిరంలోని అసంతృప్తికి, భవిష్యత్ పరిణామాలకు అద్దం పడుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
జనవరి 14 తర్వాతే అసలు సిసలు రాజకీయం : “జనవరి 14 తర్వాత మంత్రివర్గాన్ని విస్తరిస్తాం” అని జేడీయూ శాసనసభాపక్ష సమావేశంలో నీతీశ్ కుమార్ స్వయంగా ప్రకటించారు. ఈలోగా విపక్షాల నుంచి ఎవరెవరు వస్తారో తేల్చుకుని, వారితో బేరసారాలు పూర్తి చేసి, విస్తరణలో వారికి పట్టం కట్టాలన్నది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. “అధికార పార్టీతో ఉంటేనే నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు జరుగుతాయి. తమ రాజకీయ భవిష్యత్తు కోసం, ప్రజలకు జవాబు చెప్పుకోవడం కోసం చాలామంది విపక్ష ఎమ్మెల్యేలు ఎన్డీఏ వైపు చూస్తున్నారు,” అని బీజేపీ అధికార ప్రతినిధి ప్రేమ్ రంజన్ పటేల్ పేర్కొనడం ఈ వాదనకు మరింత బలాన్నిస్తోంది.

