బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కవిత ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja singh) సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత మాట్లాడింది నిజమేనని స్పష్టం చేశారు.
‘‘పెద్ద ప్యాకేజీ వస్తే బీజేపీ నేతలు బీఆర్ఎస్ పార్టీతో కలిసిపోతారు. కమలం అభ్యర్థులు ఎక్కడి నుంచి పోటీ చేయాలో వాళ్లే డిసైడ్ చేస్తారు. గతంలోనూ ఇదే జరిగింది. అందుకే బీజేపీ నష్టపోయింది. ప్రతి ఎన్నికల్లోనూ మా నేతలు కుమ్మక్కయ్యారు. ఇతర పార్టీలతో మా నేతల కుమ్మక్కుతోనే పార్టీ నష్టపోయింది. రాష్ట్రంలో బీజేపీ ఎందుకు అధికారంలోకి రాలేదో అధిష్టానం పెద్దలు ఆలోచించాలి. ఇతర పార్టీల నేతలతో మా నేతల కుమ్మక్కు అందరికీ తెలుసు’’ అని రాజాసింగ్ ఆరోపించారు. దీంతో రాజాసింగ్ వ్యాఖ్యలు కమలం పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి.