కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరైన మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(Eatala Rajendar) సంచలన వ్యాఖ్యలు చేశారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన ఈటల.. కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు తన పరిధి మేరకు సమాధానాలు ఇచ్చానని తెలిపారు.
తన 25ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ బాధ్యతలో ఉన్నా నిజాయితీగా పనిచేశానని పేర్కొన్నారు. జలయజ్ఞంలో భాగంగా తుమ్మిడిహట్టి ప్రాజెక్టుకు రూ.16,500 కోట్లు అంచనా వేశారని.. ఆ తరువాత రూ.38వేల కోట్లకు పెంచారన్నారు. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ఒప్పుకోలేదన్నారు. దీంతో రీడిజైన్ కోసం మాజీ సీఎం కేసీఆర్ సబ్ కమిటీ వేశారని తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు చైర్మన్గా సబ్ కమిటీలో తాను, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నామని.. ఎక్స్పర్ట్ కమిటీ, టెక్నికల్ కమిటీ, సబ్ కమిటీ నిర్ణయం మేరకు రీ డిజైన్ జరిగిందని ఈటల చెప్పుకొచ్చారు.
కాళేశ్వరం కార్పొరేషన్ తోనూ తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు సమాచారం అంతా కేసీఆర్, హరీశ్ రావు వద్దే ఉందని చెప్పారు. ఇందులో ఆర్థిక శాఖ పాత్ర పెద్దగా లేదన్నారు. త్వరగా కాళేశ్వరం కమిషన్ రిపోర్టును బయటపెట్టాలని ప్రభుత్వాన్ని ఈటల డిమాండ్ చేశారు. నిజమైన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని.. దోషులను శిక్షించకపోతే ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి శిక్ష తప్పదు అని హెచ్చరించారు.
కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్పై పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కమిషన్ ముందు బహిరంగ విచారణకు హాజరయ్యారు. కమిషన్ ముందు 113వ సాక్షిగా ఈటల హాజరు కాగా.. బ్యారేజీ నిర్మాణం, కాళేశ్వరం కార్పొరేషన్, డీపీఆర్లపైనే కమిషన్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సుమారు గంటన్నర పాటు కాళేశ్వరం కమిషన్ ఈటలను విచారించింది.