Saturday, November 15, 2025
HomeతెలంగాణHairsh Rao: గురుకులాల్లో దారుణ పరిస్థితులు.. 93 మంది మృతి: హరీష్

Hairsh Rao: గురుకులాల్లో దారుణ పరిస్థితులు.. 93 మంది మృతి: హరీష్

BRS Leaders On TG gurukula’s: తెలంగాణలోని గురుకుల విద్యాసంస్థల్లో వరుస ఘటనలు కలకలం రేపుతున్నాయని BRS నేతలు మండిపడుతున్నారు. విద్యార్థుల ప్రాణాలు తీయడమేంటి అనే స్థాయికి పరిస్థితి దిగజారిందని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే ఇందుకు కారణమని BRS నేతలు ఆరోపిస్తున్నారు. గత 20 నెలల పాలనలో మొత్తం 93 మంది విద్యార్థులు మృతి చెందడాన్ని హైలైట్ చేస్తూ, మాజీ మంత్రి హరీష్ రావు గురుకులాల పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

ఇటీవలి ఘటనలు శోచనీయం

హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని కరుణాపురం మహాత్మా జ్యోతిబాపూలే బాలుర గురుకులంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం తుప్రాన్‌పేట B.C. బాలికల గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. అలాగే, నల్గొండ జిల్లా దేవరకొండ ST బాలికల గురుకులంలో ఫుడ్ పాయిజన్ కారణంగా 15 మంది విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట B.C. గురుకులంలో నాణ్యతలేని ఆహారంపై విద్యార్థులు నిరసనకు దిగారు.

“మాటలే తప్ప చర్యలు లేవు”

గురుకులాల పరిస్థితిని స్వయంగా పరిశీలిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు కేవలం హామీలుగానే మిగిలిపోయాయని, ఆచరణలో ఏమీ కనిపించడంలేదని హరీష్ రావు ధ్వజమెత్తుతున్నారు. విద్యా సంవత్సరం మొదలవగానే పిల్లలు తరగతుల వైపు అడుగులు వేయాల్సింది పోయి, వారి ప్రాణాల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్న స్థితి ఏర్పడిందని ఆవేదన వ్యాఖ్యం చేశారు.

BRS పాలనలో తెలంగాణ గురుకుల విద్యావ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ప్రస్తుతం మాత్రం పూర్తిగా నిర్లక్ష్య పాలన కారణంగా ఆ వ్యవస్థ కుదేలవుతోందని విమర్శలు గుప్పించారు. తగిన ఆహారం లేని పరిస్థితుల్లో విద్యార్థులు పస్తులుండాల్సి రావడం, చౌక నాణ్యతలేని ఆహారమే అందించబడుతుండటం, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించక ఆహార సరఫరాలో అంతరాయం ఏర్పడటాన్ని హరీష్ రావుతో పాటు ఆ పార్టీ తీవ్రంగా తప్పుపడుతోంది.

గురుకులాల్లో విద్యార్థులకు సరైన పోషకాహారం అందించాలని, ఫుడ్ పాయిజన్ వంటి ప్రమాదాలను నిరోధించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని, ఆత్మహత్యలు జరిగే పరిస్థితులను నివారించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని BRS పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతోంది. వారం వారం మారే హామీలు కాదు, ప్రత్యక్ష కార్యాచరణే ఈ సమస్యలకు పరిష్కారం కావాలని స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ విద్యావ్యవస్థపై మళ్లీ విశ్వాసాన్ని నెలకొల్పాలంటే ప్రభుత్వానికి ఉన్నత ప్రమాణాల బద్ధత అవసరమని, విద్యార్థుల ప్రాణాలు పెట్టుబడిగా చూడకుండా బాధ్యతగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారని, అందుకు తగ్గట్టుగానే పాలన కొనసాగించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad