జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(Maganti Gopinath)ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉందని ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్(Dasoju Sravan)తెలిపారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని.. మరో 48 గంటలు గడిస్తేనే పరిస్థితి తెలుస్తుందని వైద్యులు చెప్పారని పేర్కొన్నారు. మరోవైపు మాజీ మంత్రి హరీశ్ రావు కూడా ఆసుపత్రిలోనే ఉండి వైద్యులతో నిరంతరం మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. గోపీనాథ్ కోలుకోవాలని ప్రజలు, పార్టీ శ్రేణులు పూజలు చేయాలని కోరారు. కార్యకర్తలు ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించారు.
మాగంటి గోపీనాథ్ గుండె సంబంధిత సమస్యలతో పాటు కిడ్నీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తెలిపారు. ప్రస్తుతం ఏఐజి వైద్య నిపుణులు ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. మాగంటి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని.. ఈ 48 గంటలు చాలా క్రిటికల్ అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు.
కాగా మాగంటి గోఫినాథ్ ఇవాళ మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యతో బాధపడుతున్న ఆయన.. అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆయనను హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. కొన్ని రోజుల క్రితం కూడా ఇదే ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకున్నారు. ప్రస్తుతం మరోసారి అనారోగ్యానికి గురికావడంతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు.