Jubilee Hills Elections: తెలంగాణ రాజకీయంలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హాట్ టాపిక్గా మారింది. గతంలో గ్రేటర్ హైదరాబాద్లో జరిగిన ఓ బైపోలులో పరాజయం చూసిన బీఆర్ఎస్ పార్టీకి, తాజా ఉపఎన్నిక మరో పరీక్షగా మారింది. BRS సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన ఈ సీటును మళ్ళీ తామే గెలిచి సుస్థిరం చేసుకోవాలని గులాబీ పార్టీ ఆశిస్తోంది.
బీఆర్ఎస్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఎన్నికను సాధించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నెగటివ్ ప్రభావం పడొచ్చని వారు అంచనా వేస్తున్నారు. అందుకే జూబ్లీహిల్స్ను ఒక ‘సెమీఫైనల్’గా భావిస్తూ.. పార్టీ టాప్ లీడర్షిప్ ముమ్మరంగా రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. ఈ ఉప ఎన్నిక కోసం మొదటిసారిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ముఖ్య నేత హరీశ్ రావు ఇద్దరూ కలిసి పనిచేయబోతున్నారని సమాచారం.
సానుభూతి, నెగటివ్ కాంగ్రెస్ పాలనపై క్యాష్ చేయాలనే వ్యూహం
ఈ సీటు సాధించేందుకు పార్టీకి కొన్ని అనుకూలతలు కనిపిస్తున్నాయి. మొదటిది, ఇది సిట్టింగ్ సీటు కావడంతో కొంత అనుకూలత ఉంటుందని భావిస్తున్నారు. అలాగే మాగంటి గోపినాథ్కు ప్రజల్లో ఉన్న గౌరవం, కుటుంబానికి ఉన్న మద్దతు కూడా ఓట్లు కలిగించే అవకాశం ఉంది. మరోవైపు, అధికార కాంగ్రెస్ పార్టీ పాలనపై పెరుగుతున్న అసంతృప్తిని ప్రజల్లో బీఆర్ఎస్ క్యాష్ చేయాలనుకుంటోంది.
ఈ నేపథ్యంలో మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను అభ్యర్థిగా బరిలోకి దించాలని బీఆర్ఎస్ యోచనలో ఉంది. ఆమెను ఎన్నికలో నిలబెట్టడం వలన ప్రజల నుంచి సానుభూతి ఓట్లు కూడా సాధించే అవకాశం ఉందని పార్టీ యోచిస్తోంది. అందులో భాగంగా BRS నిర్వహించిన తమ సర్వేతో పాటు, ప్రభుత్వ ఇంటెలిజెన్స్ సర్వేల్లోనూ బీఆర్ఎస్కు అనుకూల ఫలితాలు వచ్చాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
కేటీఆర్, హరీశ్ రావు కలిసి రంగంలోకి – తొలి మోడల్
ఇప్పటి వరకు జరిగిన ఉపఎన్నికలలో కేటీఆర్, హరీశ్ రావులలో ఎవరో ఒకరు బాధ్యతలు తీసుకున్న సందర్భాలే ఉన్నాయి. కానీ జూబ్లీహిల్స్లో మాత్రం కేటీఆర్, హరీశ్ రావును ఒకేసారి రంగంలోకి దించాలని గులాబీ బాస్ ప్లాన్ చేస్తున్నారు. బస్తీ ప్రాంతాలపై హరీశ్ రావు దృష్టి పెట్టగా, యూప్ మార్కెట్ ఎరియాల్లో కేటీఆర్ ప్రచారానికి దిగనున్నట్లు సమాచారం. ఈ కలయికతో మాస్, క్లాస్ ఓటర్లను ఆకర్షించే వ్యూహం సిద్ధం చేశారట.
వ్యవస్థపూర్వకంగా కార్యాచరణ – డోర్ టు డోర్ ఫోకస్
ప్రతి డివిజన్కు ఓ సీనియర్ నాయకుడిని ఇన్చార్జ్గా పెట్టాలని, అవసరమైతే జిల్లాల నుండి క్యాడర్ను తెప్పించాలని కూడా నిర్ణయం తీసుకున్నారట. ప్రతీ 100 ఓటర్లకు ఓ అబ్జర్వర్ను నియమించి వారిపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. అధిక మెజార్టీతో గెలవాలనే లక్ష్యంతో ఇంటింటికీ వెళ్లే ప్రచారాన్ని అమలు చేయనున్నారు.
బీఆర్ఎస్ అధినేతలు ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్లో పార్టీ పాలనలో చేసిన అభివృద్ధి పనులు, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలన వల్ల వచ్చిన సమస్యల మధ్య స్పష్టమైన తేడాను ప్రజలకు వివరించేందుకు వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ ఉప ఎన్నికను సెమీఫైనల్గా భావిస్తున్న బీఆర్ఎస్, ఈ విజయం పార్టీకి ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుందని, క్యాడర్లో నూతన ఉత్సాహం నింపుతుందని ఆశిస్తోంది. మాగంటి కుటుంబం ద్వారా వచ్చే మద్దతు, గ్రౌండ్ సర్వేల్లో కనిపించిన పాజిటివ్ టెంపో, టాప్ నేతల సమన్వయంతో ఈ బైపోల్ను పార్టీ ఏం చేసైనా గెలవాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది.