KTR Jubilee Hills By Election campaign: అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలిచ్చిందో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడిపోతున్నామనే నిరాశతో సీఎం రేవంత్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా రహ్మత్నగర్ డివిజన్లో నిర్వహించిన భారీ రోడ్షోలో కేటీఆర్ .. కాంగ్రెస్ ప్రభుత్వంపైనిప్పులు చెరిగారు.
500 రోజుల్లో తిరిగి కేసీఆర్ సీఎం కాబోతున్నారు: కాంగ్రెస్కు ఓట్లు వేయకుంటే అన్నీ రద్దుచేస్తామని ధమ్కీ ఇవ్వడం అత్యంత హేయమైన చర్య అని కేటీఆర్ మండిపడ్డారు. యావత్ తెలంగాణ ప్రజలను రేవంత్ రెడ్డి మోసం చేశారని అన్నారు. తెలంగాణ ప్రజల ఆశలు మొత్తం జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చే తీర్పు పైనే ఆధారపడి ఉందని అన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు పెట్టే వాతలకు ప్రభుత్వం పతనంకాక తప్పదని.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలవాలని రేవంత్రెడ్డి ప్లాన్ వేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి కౌంట్డౌన్ మొదలైందని తెలిపారు. 500 రోజుల్లో తిరిగి కేసీఆర్ సీఎం కాబోతున్నారని తెలిపారు.
ఒక్క ఫోన్ కొడితే 40 మంది ఎమ్మెల్యేతో వస్తా: మాగంటి గోపన్న లేడని, సునీతమ్మ ఆడబిడ్డ అని అనుకోవద్దని కేటీఆర్ అన్నారు. ఆడబిడ్డ అంటే ఆదిశక్తని తెలిపారు. అంతేకాకుండా రౌడీలు సతాయిస్తే ఎట్లా అని కూడా అనుకోవద్దని తెలిపారు. జనతా గ్యారేజ్ వంటి బీఆర్ఎస్ భవన్ పక్కనే ఉందని అన్నారు. మీరు ఒక్క ఫోన్ కొడితే 40 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వస్తా. అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ మొత్తం మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గోపీనాథ్ కాపాడిన శివమ్మ పాపిరెడ్డి హిల్స్ స్థలంలో పెద్ద స్టేడియం కట్టించి ఆయన పేరు పెడతామని తెలిపారు. ఒక్క ఆడబిడ్డను ఓడించేందుకు సీఎం, మంత్రులు కాలికి బలపం కట్టుకొని గల్లీగల్లీ తిరుగుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు.


