ఏసీబీ, ఈడీ ఒకేరకమైన ప్రశ్నలు అడిగారని.. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఏసీబీ అధికారులు 80 ప్రశ్నలు, ఈడీ అధికారులు 40 ప్రశ్నలు అడిగారని.. అన్నిటికీ సమాధానం చెప్పానని ఆయన పేర్కొన్నారు. అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడిగారని ఆయన పేర్కొన్నారు. ఈడీ విచారణ ముగిసిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
సీఎం రేవంత్ రెడ్డి కక్ష సాధించాలనే తనపై కేసులు పెట్టారని కేటీఆర్ ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ అడ్డంగా దొరికిపోయారని.. అందుకే తన మీద కూడా ఏసీబీ కేసు పెట్టించారని అన్నారు. ఇక రేవంత్ రెడ్డి మీద ఈడీ కేసు ఉంది కాబట్టే తననూ ఈడీ విచారిస్తోందని తెలిపారు. అయితే ఏది ఏమైనా చివరకు నిజం, న్యాయం, ధర్మం గెలుస్తుందని పేర్కొన్నారు. దేశ న్యాయవ్యవస్థ మీద, న్యాయమూర్తుల మీద విశ్వాసం, నమ్మకం ఉందన్నారు. ప్రజలకు కాస్త ఆలస్యంగా అయినా పూర్తి వాస్తవాలు తెలుస్తాయన్న విశ్వాతం తనకు ఉందని కేటీఆర్ చెప్పారు.
ఇక విచారణ గురించి మాట్లాడుతూ.. ఈడీ అధికారులు 8 గంటల పాటు అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడిగారని అన్నారు. తాను ఏ తప్పు చేయలేదని.. అరపైసా అవినీతి జరగలేదని.. తప్పు ఉంటే రుజువు చేయండని.. అప్పుడు ఏ శిక్షకైనా సిద్ధమని అధికారులకు చెప్పినట్లు వివరించారు. పారదర్శకంగా నిధుల బదిలీ జరిగింది ఇంకెక్కడ మనీ లాండరింగ్ అని ఏసీబీ, ఈడీ అధికారులను అడిగినట్లు పేర్కొన్నారు. తనకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్.. తాను ఏ తప్పు చేయలేదని.. చేయబోనని మరోసారి తెలిపారు.