Telangana Cabinet on Local Body Elections:స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన తొలగించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన కారణంగా ఆశావాహులు పోటీ నుంచి వెనక్కు తగ్గడంతో.. ఈ నిర్ణయంపై మంత్రివర్గం ఈ రోజు భేటీ అయింది. ఈ నేపథ్యంలో మంత్రుల అభిప్రాయం మేరకు ఇద్దరు పిల్లల నిబంధన తొలగిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది.
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో గురువారం మంత్రివర్గం సమావేశమైంది. మీటింగ్లో పలు కీలక అంశాలపై సీఎం రేవంత్రెడ్డి చర్చించారు. కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాకు తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై ఈ నెల 23న జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/fake-babas-exploit-superstitions-sexual-abuse-fraud/
పలు రంగాలకు భూ కేటాయింపులు జరిగేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఖరీఫ్ సీజన్కు ధాన్యం కొనుగోళ్లలో మద్దతు ధరతో పాటు సన్నవడ్లకు రూ. 500 బోనస్ కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేసినా.. చేయకపోయినా.. రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పేర్కొన్నారు.
కేబినెట్ మీటింగ్లో ఆమోదం తెలిపిన అంశాలు..
- రాష్ట్రంలో కొత్తగా 3 వ్యవసాయ కళాశాలల ఏర్పాటు
- నల్సార్ యూనివర్సిటీలో స్థానిక విద్యార్థులకు 50 శాతం సీట్లు, యూనివర్సిటీకి అదనంగా 7 ఎకరాలు
- హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయం. ఎల్అండ్టీ నుంచి స్వాధీనం చేసుకునే అంశంపై చర్చ
- మెట్రో రెండో దశను క్షుణ్ణంగా పరిశీలించేందుకు సీఎస్ ఛైర్మన్గా కమిటీ
- హ్యామ్ మోడ్లో మొదటి దశలో 5,566 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం.
- కృష్ణా జిల్లా – వికారాబాద్ మధ్య బ్రాడ్గేజ్ రైలు మార్గం నిర్మాణానికి సంబంధించి 845 హైక్టార్ల భూ సేకరణకు అయ్యే రూ.438 కోట్ల వ్యయం భరించేందుకు నిర్ణయం
- మన్ననూర్ – శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి మొత్తం వ్యయంలో మూడో వంతు భరించేందుకు తీర్మానం
- రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి 9 వ తేదీ వరకు ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు
- ఎలివేటెడ్ కారిడార్లకు సంబంధించి రక్షణ శాఖ భూములకు ప్రత్యామ్నాయంగా 435.08 ఎకరాల భూములు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం
- భద్రాద్రి జిల్లా జూలూరుపాడులో ఏన్కూరు మార్కెట్ యార్డుకు భూ కేటాయింపుపై తీర్మానం


