తెలంగాణలో గ్రూప్ 1(Group 1 Exams) పరీక్షల వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Koushik Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రూప్ 1 పరీక్షల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 1 పరీక్షల్లో పెద్ద కుంభకోణం జరిగిందని కోట్ల రూపాయలు చేతులు మారాయంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఓ కాలేజీలోని 18, 19వ పరీక్ష కేంద్రాల్లో పరీక్ష రాసిన 1497 మందిలోనే 74 మంది ఎలా ఎంపిక అవుతారని ప్రశ్నించారు. అసలు పరీక్షలే రాయని 10 మంది ఎలా ఎంపిక అయ్యారని నిలదీశారు. 654 మందికి ఒకేలా మార్కులు ఎలా వస్తాయో చెప్పాలన్నారు.
పేపర్లను ప్రొఫెసర్లతో ఎందుకు కరెక్షన్ చేయించలేదో తెలపాలన్నారు. పైకి మాత్రం పరీక్షలు నిర్వహించి, లోపల మాత్రం ఉద్యోగాలు అమ్ముకున్నారని ఆరోపించారు. వెంటనే గ్రూప్ 1 నియామకాలు నిలిపి వేయాలని ఈ పరీక్షలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా గ్రూప్ 1లో అక్రమాలు జరిగాయంటూ ఇటీవలే మరో బీఆర్ఎస్ నేత పైడి రాకేశ్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే.