తెలంగాణలో మరో ఎయిర్పోర్టు రానుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ఫలించాయి. వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్టు(Mamunuru Airport) అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు కేంద్ర విమానాయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. త్వరితగతిన నిర్మాణ పనులు చేపట్టాలని ఎయిర్ పోర్ట్ అథారిటీని ఆదేశించారు. కేంద్రం నిర్ణయం పట్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
ఎయిర్పోర్టు విస్తరణకు అవసరమైన 256 ఎకరాల భూసేకరణకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.205 కోట్లు విడుదల చేసింది. ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించి డిజైన్లతో కూడిన డీపీఆర్ను సిద్ధం చేయాలని ఎయిర్పోర్టు అథారిటీకి లేఖ రాసింది. ఇప్పటికే ఎయిర్పోర్టు పరిధిలో 696 ఎకరాల భూమి ఉండగా.. ఆ భూమికి అదనంగా మరో 253 ఎకరాల భూమి సేకరించనుంది. ఇందులో కొంత రన్వే విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ), నేవిగేషన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్టలేషన్ నిర్మాణాలు చేపట్టనుంది.

శంషాబాద్ విమానాశ్రయం నుంచి 150 కిలోమీటర్ల పరిధిలో మరో విమానాశ్రయం ఉండకూడదని గతంలో జీఎంఆర్ సంస్థ ఒప్పందం చేసుకుంది. జీఎంఆర్ సంస్థలో పలు దఫాలు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేకంగా చర్చలు జరిపారు. దీంతో మామునూరు ఎయిర్పోర్టుకు జీఎంఆర్ అంగీకారం తెలిపింది. కాగా నిజాం కాలంలో మామునూరు నుంచి వాయుదూత్ విమానాలు నడిచేవి. ఇప్పుడు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మళ్లీ రెక్కలు రానున్నాయి.