Friday, January 16, 2026
HomeతెలంగాణCentralized kitchen: ప్రతి రెండు నియోజకవర్గాలకు ఒక సెంట్ర‌లైజ్డ్ కిచెన్.. విద్యార్థులకు అక్కడి నుంచే బ్రేక్...

Centralized kitchen: ప్రతి రెండు నియోజకవర్గాలకు ఒక సెంట్ర‌లైజ్డ్ కిచెన్.. విద్యార్థులకు అక్కడి నుంచే బ్రేక్ ఫాస్ట్, లంచ్

Centralized kitchen across Telangana: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్‌ పథకాన్ని ప్రారంభించాలని సర్కారు గతంలోనే నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ప్రతి రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఒక సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేసి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటుకు రెండు ఎక‌రాల స్థలం కేటాయింపు లేదా 99 సంవ‌త్సరాల‌కు లీజు తీసుకునే అంశంపై కూడా జిల్లా క‌లెక్టర్లతో మాట్లాడి త్వర‌గా నిర్ణయం తీసుకోవాల‌ని సచివాలయ అధికారులను సూచించారు. విద్యా శాఖపై సచివాలయంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆధునిక అవసరాలకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులపై సమీక్షించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని ప్రభుత్వ పాఠ‌శాలలో స్వచ్ఛంద సంస్థల ద్వారా అమ‌లు చేస్తున్న బ్రేక్‌ఫాస్ట్‌, మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కాన్ని తెలంగాణ‌ వ్యాప్తంగా అమ‌లు చేయ‌డానికి గ‌ల అవ‌కాశాలను ప‌రిశీలించాలని సీఎం ఆదేశించారు.

- Advertisement -

ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్లలో సోలార్‌ కిచెన్లు..

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్ స్కూల్స్.. మొద‌టి విడ‌త‌లో ఎక్కువగా బాలికలకు కేటాయించాల‌ని సీఎం రేవంత్ ఆదేశించారు. రానున్న మూడేళ్లలో ప్రతి నియోజ‌క‌వ‌ర్గంలోనూ బాలురు, బాలిక‌ల‌కు ఒక్కొక్కటి చొప్పున వీటి నిర్మాణాలు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. తొలి విడతలో బాలిక‌ల‌కు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను కేటాయిస్తే.. సదరు నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రో విడ‌తలో బాలుర‌కు కేటాయించాలని అధికారులకు సూచించారు. ఈ స్కూళ్లలో సోలార్ కిచెన్ల నిర్మాణాలను పీఎం కుసుమ్‌లో చేపట్టే అవకాశాలను పరిశీలించాలని.. వీటి నిర్మాణాల‌కు సంబంధించి బిల్లుల‌ను ఎప్పటికప్పుడు విడుద‌ల చేయాలని సీఎం ఆదేశించారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో 23 నూత‌న పాఠ‌శాల భ‌వ‌నాలు నిర్మాణాలు వ‌చ్చే విద్యా సంవత్సరం నాటికి అందుబాటులోకి రావాలని చెప్పారు సీఎం. బాచుపల్లి పాఠశాలకు ప్రస్తుతం ఉన్న స్థలం స‌మీపంలో ఒకటిన్నర ఎకరాన్ని ఆ పాఠశాల నిర్మాణానికి కేటాయించాలని చెప్పారు. భ‌విష్యత్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లుగా ఒక‌టి నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు సిల‌బ‌స్ మార్పుపై క‌స‌ర‌త్తును వెంట‌నే ప్రారంభించాలని సీఎం రేవంత్‌ ఆదేశించారు. పాలిటెక్నిక్ కాలేజీలు, యంగ్ ఇండియా స్కిల్స్‌ యూనివ‌ర్సిటీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే ప్రతి విద్యార్థికి క‌చ్చితంగా ఉద్యోగం ల‌భించేలా సిల‌బ‌స్‌ను రూపొందించాలని, బోధ‌న అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News