Sunday, February 23, 2025
HomeతెలంగాణCM Revanth: ఆదాయ‌, ఉపాధి వ‌న‌రుగా ప‌ర్యాట‌కం

CM Revanth: ఆదాయ‌, ఉపాధి వ‌న‌రుగా ప‌ర్యాట‌కం

సమీక్షలో..

రాష్ట్రానికి ఆదాయం స‌మ‌కూర్చ‌డ‌మే కాకుండా ఎక్క‌డిక‌క్క‌డ యువ‌త‌కు ఉపాధి క‌ల్పించే వ‌న‌రుగా ప‌ర్యాట‌క శాఖ ఉండాలని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ర్షించే వ‌న‌రులు మ‌న‌కు ఎన్నో ఉన్నా, గ‌తంలో ప్ర‌చారంపైన శ్రద్ధ చూప‌క‌పోవ‌డం, వినూత్న ప‌ద్ధ‌తిలో ఆలోచించ‌క‌పోవ‌డంతో ఈ రంగంలో ఆశించిన ప్ర‌గ‌తి క‌నిపించ‌లేద‌న్నారు. తెలంగాణ ఘ‌న చ‌రిత్ర‌ను వ‌ర్త‌మానానికి అనుసంధానిస్తూ, భ‌విష్య‌త్‌కు బాట‌లు వేసేలా ప‌ర్యాట‌క శాఖ‌ను తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. ప‌ర్యాట‌క శాఖ‌పై ఐసీసీసీలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి శుక్ర‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు.

- Advertisement -

సెమీ అర్బన్-గ్రామాల్లో

సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని సీఎం అన్నారు. నాగార్జున సాగ‌ర్‌ బ్యాక్ వాట‌ర్‌లో బోట్ హౌస్‌ అందుబాటులో ఉంచాల‌ని, డెస్టినేష‌న్ వెడ్డింగ్‌ల‌కు తెలంగాణ‌ను వేదిక‌గా మార్చాల‌ని సీఎం సూచించారు. ఆల‌యాలు, పులుల అభ‌యార‌ణ్యాల‌కు ప‌ర్యాట‌కంలో ప్ర‌త్యేక ప్రాధాన్యం ఉంద‌ని, ఆ దిశ‌గా దృష్టిసారించి అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ముఖ్యమంత్రి అధికారుల‌ను ఆదేశించారు. భ‌ద్రాచ‌లం, స‌లేశ్వ‌రం, రామ‌ప్ప వంటి ఆల‌యాలు, మల్లెల తీర్ధం, బొగ‌త జ‌ల‌పాతాలు, బౌద్ధ స్తూపాలు, జైన ఆల‌యాలు ఇలా ప్ర‌తి ఒక్క ప‌ర్యాట‌క ప్ర‌దేశంలో వ‌స‌తులు మెరుగుప‌ర్చ‌డంతో పాటు స‌రైన ప్ర‌చారం క‌ల్పించాల‌ని సీఎం అధికారుల‌కు సూచించారు. భువ‌న‌గిరి కోట రోప్ వే ప‌నుల‌పైనా సీఎం ఆరా తీశారు. భూ సేక‌ర‌ణ‌లో కొంత జాప్యం జ‌రిగింద‌ని, ఇప్పుడు భూ సేక‌ర‌ణ పూర్త‌యినందున త్వ‌ర‌లో టెండ‌ర్లు పిలుస్తామ‌ని అధికారుల‌కు సీఎంకు తెలియ‌జేశారు. సాధ్య‌మైనంత త్వ‌రగా భువ‌న‌గిరి కోట రోప్ వే ప‌నుల‌కు టెండ‌ర్లు పిల‌వ‌డంతో పాటు కోట‌పై ఉన్న చారిత్రక క‌ట్ట‌డాల ప‌రిర‌క్ష‌ణ‌కు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం ఆదేశించారు.

బడ్జెట్ పెంచుతాం

ప‌ర్యాట‌క శాఖ పాల‌సీకి తుది రూపు ఇచ్చే స‌మ‌యంలో అట‌వీ, ఐటీ, విద్యుత్‌, టీజీ ఐఐసీ, వైద్య, క్రీడ‌ల శాఖ‌ల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని, ఒక శాఖ విధానాలు మ‌రో శాఖ విధానాలకు ఆటంకంగా ఉండ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారుల‌కు తెలియ‌జేశారు. అడ్వెంచ‌ర్ స్పోర్ట్స్‌కు ప‌ర్యాట‌క శాఖ‌లో ప్రాధాన్యం ఇవ్వాల‌ని సీఎం అన్నారు. వైద్య అవ‌స‌రాల‌కు విదేశాల నుంచి వ‌చ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప‌ర్యాట‌కుల్లా వ‌చ్చిపోయేలా అన్ని చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎం ఆదేశించారు. ప‌ర్యాట‌క శాఖ‌కు బడ్జెట్ కేటాయింపులు పెరిగేలా చూస్తామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

స‌మీక్ష‌లో రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, ముఖ్యమంత్రి స‌ల‌హాదారు వేం న‌రేంద‌ర్ రెడ్డి, రాష్ట్ర ప‌ర్యాట‌కాభివృద్ధి సంస్థ ఛైర్మ‌న్ ప‌టేల్ ర‌మేశ్ రెడ్డి, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు (మౌలిక వ‌స‌తులు) శ్రీ‌నివాస‌రాజు, ముఖ్య‌మంత్రి ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీలు వి.శేషాద్రి, చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, సీఎం సంయుక్త కార్య‌ద‌ర్శి సంగీత స‌త్య‌నారాయ‌ణ‌, ప‌ర్యాట‌క శాఖ కార్య‌ద‌ర్శి స్మితా స‌బ‌ర్వాల్‌, టూరిజం డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ ఎండీ ప్ర‌కాశ్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News