CM Revanth Reddy aerial Visit: మొంథా తుపాను నేపథ్యంలో వరంగల్, హనుమకొండలో సీఎం రేవంత్ ఏరియల్ సర్వే చేపట్టారు. దెబ్బ తిన్న పంట పొలాలను ఆయన పరిశీలించారు. మొంథా తుపాను ప్రభావంతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని సీఎం పేర్కొన్నారు. వరద బాధితులను పరామర్శించారు. ప్రజలు ఎవరూ అధైర్యపడొద్దని.. అందర్నీ ఆదుకుంటామని సీఎం రేవంత్ భరోసా కల్పించారు.
మొంథా తుపాను నేపథ్యంలో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు రూ. 5 లక్షల నష్టపరిహారం చెల్లిస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. పంట నష్టం పరిహారం కింద ఎకరాకు రూ. 10 వేలు చెల్లిస్తామన్నారు. పొలాల్లో ఇసుక మేటలు తొలగించేందుకు ఎకరాకు లక్ష అయినా చెల్లిస్తామని చెప్పారు. దెబ్బతిన్న ప్రతి ఇంటికి రూ. 15 వేల ఆర్ధిక సాయం అందిస్తామని సీఎం రేవంత్ వెల్లడించారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/montha-cyclone-deaths-telangana-floods/
వర్షాలు తగ్గాయి కాబట్టి పంట నష్టం అంచనాలు వేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. శాఖల మధ్య సమన్వయం లేకపోతే నష్టం జరుగుతుందని.. అన్ని శాఖల అధికారులు, కలెక్టర్ల మధ్య సమన్వయం ఉండాలని సీఎం సూచించారు. ఆస్తి నష్టం, పంట నష్టం అంచనాలో ప్రజాప్రతినిధులను వెంట తీసుకెళ్లాలని స్పష్టం చేశారు.
‘తెలంగాణ ధనిక రాష్ట్రమని కేంద్రం వదిలేస్తే కుదరదు. కేంద్ర ప్రభుత్వంతో నిధులు రాబట్టాలి. కేంద్రం నుంచి ప్రతి రూపాయి రాబట్టేలా కలెక్టర్లు నివేదికలు తయారు చేయాలి. ఇన్ఛార్జ్ మంత్రులు, కలెక్టర్లతో నివేదికలు సిద్ధం చేయించాలి. ఇంకా నిధులు అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇస్తుంది.’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/cyclone-montha-telangana-roads-damaged-record-rain/
వరంగల్ సిటీలో నాలాలు, చెరువుల కబ్జాలను తొలగించాల్సిందే అని రేవంత్ స్పష్టం చేశారు. వరంగల్ స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా నిధులతో పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. క్లౌడ్ బరస్ట్లు భవిష్యత్లో కూడా వస్తాయని.. ఈ సమస్యలను అధిగమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.


