బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలోకి మారిన సంగతి తెలిసిందే. దీనిపై బీఆర్ఎస్ నేతలు హైకోర్టు, సుప్రీం కోర్టులో పిటిషన్లు వేయడం.. త్వరలోనే సుప్రీంకోర్టులో తుది తీర్పు వస్తుందని భావిస్తున్నారు. దీంతో పార్టీ ఫిరాయించిన నేతలు రాజీనామాలు చేసి ఉపఎన్నికలకు వెళ్తారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఉప ఎన్నికల(By Elections)పై సీఎం రేవంత్ రెడ్డి((CM Revanth Reddy) అసెంబ్లీ వేదికగా స్పందించారు.
రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావని ఆయన తేల్చి చెప్పారు. సభ్యులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని సూచించారు. ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టకుండా.. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడం మేలన్నారు. ఇతర పార్టీ నేతలు తమతో చేరినా చేరిన వాళ్ళు వెనక్కి వెళ్ళినా ఉప ఎన్నికలు వచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి మీదనే తాను ఫోకస్ పెట్టానని, ఇలాంటి విషయాల మీద ఫోకస్ పెట్టి తన సమయం వృథా చేసుకోనని పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వచ్చినా అన్నిటికీ తాము సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు. మొత్తానికి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఫిరాయింపు నేతలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.