తెలంగాణ పోలీసుశాఖను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అభినందనలు తెలిపారు. ఇండియా జస్టిస్ రిపోర్ట్ – 2025 ప్రకారం తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్లో పోలీసు అధికారులను అభినందించారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రాష్ట్ర డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి ఇండియా జస్టిస్ రిపోర్ట్లోని అంశాలను సీఎంకు వివరించారు.
‘ఇండియా జస్టిస్ రిపోర్ట్-2025’ ప్రకారం, కోటి కంటే ఎక్కువ జనాభా ఉన్న 18 రాష్ట్రాలలో పోలీసింగ్ విషయంలో తెలంగాణ పోలీసు శాఖ మొదటి స్థానంలో నిలిచింది. టాటా ట్రస్ట్, సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, కామన్ కాజ్ వంటి ప్రఖ్యాత సంస్థలు రూపొందించిన ఈ నివేదికలో తెలంగాణకు గొప్ప గుర్తింపు దక్కడం రాష్ట్ర పోలీసుల కృషికి దక్కిన గౌరవమని, ఈ ఘనత రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శాంతిభద్రతలు కాపాడడం, నేరాలను నియంత్రించడం, నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసుల నమోదులో పారదర్శకత చూపడం ద్వారా తెలంగాణ పోలీసులు రాష్ట్రంలో శాంతి, న్యాయం నిలబెట్టడంలో విజయవంతమయ్యారని పేర్కొన్నారు. రాజీలేని కర్తవ్య నిర్వహణతో పోలీసులు ప్రజల్లో నమ్మకాన్ని పెంచారని, ప్రజా పాలనలో ఈ విజయం పోలీసు శాఖ సమిష్టి కృషి ఫలితమని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో మరిన్ని ఇలాంటి విజయాలను తెలంగాణ పోలీసులు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
